Reading Time: 2 minutes

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూపీఐ (UPI) ద్వారానే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే దీనితో పాటే ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కస్టమర్ల కష్టార్జితాన్ని కాపాడేందుకు బ్యాంకులు ఇప్పుడు ఒక సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చాయి. ఇకపై మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫోన్ స్క్రీన్‌పై వచ్చే ‘యస్’ (YES) ఆప్షన్‌ను క్లిక్ చేస్తేనే నగదు బదిలీ అయ్యేలా కొత్త ఫీచర్‌ను ప్రతిపాదించాయి. అసలు ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

అనుమానాస్పద లావాదేవీలకు మాత్రమే చెక్: ఈ కొత్త ఫీచర్ ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్‌కు రాదు. కేవలం సిస్టమ్ అనుమానాస్పదంగా లేదా హై-రిస్క్ (High Risk) అని గుర్తించిన లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.ఇక  సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపుతున్నప్పుడు లేదా కొత్త అకౌంట్లకు డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఈ సెక్యూరిటీ మోడ్ యాక్టివేట్ అవుతుంది.

Banks Introduce 'YES' Confirmation to Prevent Online Fraud
Banks Introduce ‘YES’ Confirmation to Prevent Online Fraud

పాప్-అప్ విండోతో అదనపు రక్షణ: మీరు లావాదేవీ పూర్తి చేసే సమయంలో ఫోన్ స్క్రీన్‌పై ఒక ప్రత్యేకమైన ‘పాప్-అప్ విండో’ (Pop-up Window) ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు పంపుతున్న నగదు వివరాలు కనిపిస్తాయి. ఇక మీరు అవన్నీ సరి చూసుకుని, స్వయంగా ‘YES’ అని క్లిక్ చేస్తేనే చెల్లింపు పూర్తవుతుంది. ఒకవేళ పొరపాటున లేదా ఫ్రాడ్ కాల్స్ ప్రభావంతో డబ్బు పంపుతుంటే.. ఈ స్క్రీన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

ఆర్‌బీఐ ఆమోదం లభిస్తే అమల్లోకి: పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందు ఉంచాయి. ఆర్‌బీఐ దీనికి పచ్చజెండా ఊపితే త్వరలోనే ఈ అదనపు భద్రతా ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇక ఇది అమల్లోకి వస్తే తొందరపాటులో జరిగే ఫ్రాడ్స్ చాలా వరకు తగ్గుతాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు.

ఇక డిజిటల్ విప్లవంతో పనులు ఎంత తేలికవుతున్నాయో, అంతే జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. బ్యాంకులు తెచ్చే ఈ కొత్త ఫీచర్ వల్ల మోసగాళ్ల బారిన పడకుండా వినియోగదారులకు మరింత రక్షణ లభిస్తుంది.

గమనిక: ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యూపీఐ పిన్ (UPI PIN), ఓటీపీ (OTP) లేదా క్యూఆర్ కోడ్ (QR Code) వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు. డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.

The post ఆన్‌లైన్ మోసాల నివారణకు బ్యాంకుల కొత్త ప్లాన్.. ‘YES’ చెప్పాకే నగదు బదిలీ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.