Reading Time: 2 minutes
ఆఫ్రికా ఖండంలో 4 ప్రపంచకప్‌లు.. టీమిండియా రికార్డులు ఇవే.. ఈసారి ట్రోఫీ పక్కా..?

Team India ICC ODI records Africa: సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికా ఖండంలో వన్డే ప్రపంచకప్ నిర్వహణకు వేదిక సిద్ధమవుతోంది. ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఐసీసీ రికార్డులను పరిశీలిస్తే ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు కనిపిస్తాయి. 2027 మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఆఫ్రికన్ మైదానాల్లో నమోదు చేసిన సంచలన గణాంకాలపై ప్రత్యేక కథనం.

భారత వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో ఆఫ్రికా ఖండానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2000వ సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని యువ భారత్ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. వరుస విజయాలతో ఫైనల్ వరకూ దూసుకెళ్లిన టీమిండియా, ఆఖరి సమరంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఆఫ్రికా నేలపై భారత జట్టు సాధించిన మొదటి ప్రధాన ఐసీసీ టోర్నీ విజయావకాశం అక్కడ చేజారినా, జట్టులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఇదికూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!

2003 వన్డే ప్రపంచకప్ రన్నరప్.. సచిన్ విధ్వంసం..

ఆ తర్వాత 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ భారత అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన బ్యాట్‌తో విధ్వంసకర ఫామ్‌ను కనబరిచి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే వాండరర్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో ఓటమి ఎదురై మరోసారి రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది.

2007 టీ20 ప్రపంచకప్.. ధోనీ సేన చారిత్రక విజయం..

ఆఫ్రికా నేల భారత్‌కు అందించిన అత్యంత మధురమైన జ్ఞాపకం 2007 టీ20 ప్రపంచకప్. మహేంద్రసింగ్ ధోనీ తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన ఈ మెగా టోర్నీలో యంగ్ ఇండియా సంచలనాలు సృష్టించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆఫ్రికా ఖండంలో భారత క్రికెట్ చరిత్ర రాసిన అత్యుత్తమ ఘట్టంగా ఇది నిలిచిపోయింది.

ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?

2027 వన్డే ప్రపంచకప్ వేదికలు సిద్ధం..

దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 12 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ ఇప్పటికే వేదికలను కరారు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజాలతో కూడిన భారత జట్టు మరోసారి ఆఫ్రికా మైదానాల్లో కప్ వేటకు సిద్ధమవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..