
Team India: భారత క్రికెట్ జట్టు సక్సెస్లో కీలక పాత్ర పోషించిన ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ తన పదవీకాలానికి ముగింపు పలికారు. జింబాబ్వే పర్యటనతో ఆయన కాంట్రాక్ట్ పూర్తి కావడంతో, టీమిండియాతో ఐదేళ్ల అనుబంధానికి తెరపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 3న, సోమవారం) ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను విడుదల చేశారు. జట్టుతో తన ప్రయాణం ఎంతో గొప్పగా కొనసాగింది, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.
ఐదేళ్ల అంకితభావం:
నవంబర్ 2021లో భారత ఫీల్డింగ్ కోచుగా బాధ్యతలు చేపట్టిన దిలీప్.. జింబాబ్వే పర్యటనతో తన కాంట్రాక్ట్ ముగియడంతో జట్టు నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో శుభదీప్ ఘోష్ కొత్త ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దిలీప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐదేళ్లు ఎంతో అర్థవంతమైన ఈ ప్రయాణానికి సరైన మాటలు దొరకడం లేదు.. నేను ఈ సెటప్లోకి అడుగు పెట్టినప్పుడు ప్రతిరోజూ నా వంతుగా 100 శాతం ఇవ్వాలనే ఒక్కటే లక్ష్యంతో వచ్చానని వెల్లడించారు.
ప్రత్యేక ఆకర్షణగా ఫీల్డింగ్ మెడల్ ట్రెండ్:
డ్రెస్సింగ్ రూమ్లో మ్యాచ్ తర్వాత ఉత్తమ ఫీల్డర్కు ఇచ్చే ఫీల్డింగ్ మెడల్ ఆచారాన్ని టి. దిలీప్ ప్రారంభించారు. ఇది ఆటగాళ్లలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు జట్టులో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో ఈ సంప్రదాయం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఈ అనుభూతిని గుర్తు చేసుకుంటూ.. ఫీల్డింగ్ మెడల్ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో అది సృష్టించిన ఉత్సాహం, ఆటగాళ్లు దానికి ఇచ్చిన విలువ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు.
అరుదైన విజయాలకు వేదిక:
తన ఐదేళ్ల పదవీకాలంలో టీమిండియా సాధించిన అద్భుత విజయాలను దిలీప్ గర్వంగా గుర్తు చేసుకున్నారు.
* 2024 & 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయాలు
* 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు,
* 2023 & 2025 ఆసియా కప్ విజయాలు
* 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ రన్నరప్స్
ప్రత్యేక కృతజ్ఞతలు:
బీసీసీఐతో పాటు తనతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ దిలీప్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్లు తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు చెప్పాడు.
ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పని చేయడం తన అదృష్టమన్నారు. ఈ అధ్యాయం ముగిసినా, భారతదేశ జెర్సీని ధరించి దేశానికి సేవ చేసిన ఈ ఐదేళ్లు నా జీవితంలో ఎప్పటికి మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.. భారత్ మాతా కీ జై! అంటూ తన సందేశాన్ని మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ముగించాడు.