Reading Time: < 1 minute
Ap Weather Alert Orange And Yellow Lightning Warning Issued For Multiple Districts

AP Weather Alert: ఏపీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న స్థాయిలో వానలు లేకపోయినా.. ఓ మోస్తరు వానలు పడుతున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.