
మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిపై అనర్హత వేటు పడటం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. 2015 నాటి బ్యాంక్ మోసం కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష , రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ తీర్పు ఆధారంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ ఏప్రిల్ 2026లో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి, దతియా స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఈ క్రమంలో ఖాళీ అయిన స్థానానికి జూలై 30, 2026న పోలింగ్ జరగ్గా నేడు ఫలితాలు వెలువడ్డాయి.
అయితే ఉపఎన్నిక ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో నూతన చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా పోలింగ్ బూత్ నంబర్ 121 వద్ద భాజపాకు ఎదురైన ఓటమి పార్టీకి అత్యంత కలవరపాటును కలిగించే అంశంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా దతియా రాజకీయాలకు కేంద్రబిందువుగా, రాష్ట్ర మాజీ హోం మంత్రిగా చక్రం తిప్పిన నరోత్తమ్ మిశ్రా సొంత పోలింగ్ బూత్ ఇది. సొంత అడ్డాలోనే భాజపా అభ్యర్థి అశుతోష్ తివారీపై కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ 6,016 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడమే కాకుండా.. జిల్లా అధ్యక్షుడు రఘువీర్ కుష్వాహా పోలింగ్ బూత్లోనూ కాంగ్రెసే పైచేయి సాధించడం ద్వారా స్థానిక ఓటర్లు భాజపా వైఖరిపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారనేది స్పష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఓటమి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికల ఫలితం మాత్రమే కాదని.. భాజపా పరిష్కరించుకోలేకపోయిన అంతర్గత రాజకీయ వైరుధ్యాల ఫలితమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నరోత్తమ్ మిశ్రాపై కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి 7,742 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఓటమిని దృష్టిలో ఉంచుకుని భాజపా ఈసారి మిశ్రాకు టికెట్ నిరాకరించింది. అయితే.. టికెట్ నిరాకరించినప్పటికీ, ఉపఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆయన రాజకీయ ప్రభావం నీడలోనే నడపాల్సి రావడం భాజపాను ఇరుకున పడేసింది.
యువతకు, సంస్థాగత మార్పునకు ప్రతీకగా 45 ఏళ్ల అశుతోష్ తివారీని బరిలోకి దింపినప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో స్వతంత్రంగా ఎదిగే అవకాశం లభించలేదు. టికెట్ కేటాయింపు ప్రక్రియ ముగిసిన మరుక్షణమే మిశ్రా మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడం, రోడ్లు దిగ్బంధించడం, పోలీసులతో ఘర్షణలకు దిగడం వంటి సంఘటనలు భాజపాలోని అంతర్గత అసమ్మతిని రచ్చకెక్కించాయి. తివారీ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నరోత్తమ్ మిశ్రా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం ఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. అభ్యర్థి తివారీ అయినప్పటికీ.. మీడియా, రాజకీయా విశ్లేషణలన్నీ మిశ్రా కన్నీళ్ల చుట్టూనే తిరిగాయి. దీనివల్ల నూతన అభ్యర్థి ప్రాధాన్యత తగ్గిపోయింది.
మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్కు స్థానికంగా ఉన్న బలమైన సంబంధాలు, రాచరిక కుటుంబ నేపథ్యం, గతంలో దతియా, సేవ్డా నియోజకవర్గాల నుంచి గెలిచిన అనుభవం కాంగ్రెస్కు కలిసివచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ యంత్రాంగానికి మించి స్వతంత్రంగా ఓటర్లను ఆకర్షించగల సామర్థ్యం ఘనశ్యామ్ సింగ్కు ఉంది. ఎన్నికల లెక్కింపు సమయంలో భాజపా అసంతృప్త కార్యకర్తలు కాంగ్రెస్కు పరోక్షంగా సహకరించారనే వార్తలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహిరంగంగా తిరుగుబాటు చేయకపోయినా.. ఓటింగ్ సమయంలో భాజపా కార్యకర్తలు యాక్టివ్ గా లేకపోవడం లేదా ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించకపోవడం భాజపా ఓటమి తీవ్రతను పెంచింది.
దతియాలో ఈసారి 71.44 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2023 సాధారణ ఎన్నికలతో (80%) పోలిస్తే దాదాపు 9 శాతం తక్కువ. అధికారంలో ఉన్న పార్టీకి, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా ప్రచారం నిర్వహించినప్పటికీ.. పోలింగ్ శాతం తగ్గడం, ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం తగ్గడం భాజపాకు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించింది. ‘లాడ్లీ బెహనా’ వంటి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి ఓట్లుగా మారకపోవచ్చని ఈ ఎన్నిక నిరూపించింది. ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ అభివృద్ధి మంత్రం దతియా ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి దామోదర్ యాదవ్ గణనీయంగా ఓట్లు సాధించినప్పటికీ, కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. సాధారణంగా మూడో అభ్యర్థి ఓట్లను చీల్చితే అధికార పార్టీకి మేలు జరుగుతుంది, కానీ ఇక్కడ భాజపా ఓటు బ్యాంకే విచ్ఛిన్నం కావడం వల్ల కాంగ్రెస్ సునాయాసంగా గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీలో కూడా రాజేంద్ర భారతి నిష్క్రమణ రూపంలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ.. ఘనశ్యామ్ సింగ్ తన సొంత ఇమేజ్, ప్రజాదరణతో ఆ లోపాన్ని అధిగమించగలిగారు. 2014 నుండి 2026 వరకు మధ్యప్రదేశ్లో జరిగిన 52 ఉపఎన్నికల్లో భాజపా 63 శాతం విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, దతియా ఫలితం మాత్రం ఆ సంప్రదాయాన్ని తిరగరాసింది.
ఈ విజయంపై వ్యాఖ్యానిస్తున్న రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయని అంచనా వేస్తున్నారు. భాజపా అధికార బలం, విస్తృత ప్రచారం, ముఖ్యమంత్రుల పర్యటనలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని అంటున్నారు. కేవలం ఒక నియోజకవర్గంలో గెలవడమే కాకుండా, అధికార పార్టీ వైఫల్యాలను, అంతర్గత విభేధాలను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ సఫలమైందని, ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకోవడానికి ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మొత్తానికి.. 2023లో దతియా ఓటర్లు నరోత్తమ్ మిశ్రాను ఓడించగా… 2026 ఉపఎన్నికలో నరోత్తమ్ మిశ్రా నీడ నుంచి బయటపడలేకపోయిన భాజపా అభ్యర్థిని ఓడించారు. పోస్టర్పై ముఖం మారినప్పటికీ, దాని వెనుక ఉన్న రాజకీయాలు మారలేదని దతియా ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తోందని, ఇది కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి స్పష్టమైన పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.