Reading Time: < 1 minute
Pok Elections 2026 Pmln Leads Will Shehbaz Sharif Make Nawaz Sharif Pm

PoK Polls: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అసెంబ్లీ ఎన్నికల్లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొదటి రెండు దశల పోలింగ్‌లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార సమయంలో ముజఫరాబాద్‌లో జరిగిన సభలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. “PML-N విజయం సాధిస్తే తనను PoK ప్రధానమంత్రిగా చేయాలని ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కోరుతాను” అని ప్రకటించారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జూలై 27న జరిగిన తొలి దశ పోలింగ్‌లో మీర్‌పూర్ డివిజన్‌లోని 13 స్థానాల్లో PML-N తొమ్మిది స్థానాలు గెలుచుకోగా, పీపుల్స్ పార్టీ (PPP) నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆగస్టు 2న జరిగిన రెండో దశలో ముజఫరాబాద్ డివిజన్, శరణార్థుల నియోజకవర్గాల్లో కూడా PML-N ఆధిపత్యం కొనసాగించింది. తొలి రెండు దశల్లో కలిపి సుమారు 23 స్థానాలు గెలుచుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఆ పార్టీకి లభించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడో దశ పోలింగ్ ఆగస్టు 10న పూంచ్ డివిజన్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటికే PML-N ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 53 స్థానాలున్న PoK అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండగా, మిగిలిన ఎనిమిది స్థానాలు మహిళలు, టెక్నోక్రాట్లు, మత నాయకుల కోసం రిజర్వ్‌గా ఉంటాయి. అయితే నవాజ్ షరీఫ్ PoK ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షపై న్యాయపరమైన ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి కావాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఓటరు, శాసనసభ సభ్యుడు కావాలి. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ పంజాబ్‌కు చెందిన నాయకుడు. ఆయన PoK అసెంబ్లీకి పోటీ చేయలేదు. దీంతో నేరుగా ఆ పదవిని చేపట్టే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భారత్ మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఎన్నికలను గుర్తించదు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఆ ప్రాంతాలను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తోంది.