Reading Time: < 1 minute
‘IIT చదివి కలెక్టర్‌ అవుతానన్నావ్‌ కదా తల్లీ.. ఎందుకిలా ఒంటరి వాడిని చేశావ్‌..’ ఓ తండ్రి గుండె కోత

కడప, ఆగస్ట్‌ 4: కష్టపడి చదివి కలెక్టర్ అవుతానన్న కన్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాద ఛాయల్లోకి నెట్టింది. ఓ పక్క భార్య చావు తో పదేళ్లుగా ఇబ్బంది పడుతున్న ఆ తాసిల్దార్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతురు కూడా చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పెద్దముడియం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జమ్మలమడుగు తాసిల్దారుగా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి కుమార్తె అస్సాంలోని ఐఐటి గువాహటి లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. అయితే అక్కడే ఉన్న బ్రహ్మపుత్రా నది వద్దకు వెళ్లిన చేతన (20) అకస్మాత్తుగా నదిలో పడి చనిపోవడంతో ఆ తండ్రి బాధ అంతా కాదు. గత పది ఏళ్ళ క్రితం సాయినాథ్ రెడ్డి భార్య మంజుల అనారోగ్యంతో మృతి చెందారు.

భార్యను కోల్పోయిన బాధను గుండెలో దాచుకొని తన ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఆయన.. ఆమె కూడా చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. ఐఐటీ చదువుకున్న తర్వాత సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానని చెప్పావు కదా తల్లి.. ఇలా ఒంటరి వాడిని చేశావు.. అంటూ ఆ తండ్రి రోదిస్తూ మాట్లాడిన మాటలు చూపరులను కలచివేస్తున్నాయి. తాజా ఘటన వారి స్వగ్రామం పెద్దముడియంలో విషాద ఛాయలు నింపింది.