
Floodlight Collapse: విశాఖపట్నంలో వీచిన ఈదురుగాలులకు రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్ లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్టేడియంలో వందలాది మంది వాకింగ్, జాగింగ్ కోసం వస్తుంటారు. అయితే ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మైదానం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్దిసేపు వీచిన బలమైన గాలులకే ఫ్లడ్ లైట్ విరిగి పడటంతో నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఫ్లడ్ లైట్ కూలిపోవడానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ సమయంలో భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించిన విషయం విదితమే..