
హైదరాబాద్, ఆగస్ట్ 3: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు బోర్డు ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 17న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా, ఎంపిక జాబితాను తాజాగా ప్రకటించారు. డ్రైవర్ పోస్టులకు మొత్తం 1,000 పోస్టులు నోటిఫై చేయగా.. తాజా ఫలితాల్లో 894 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. శ్రామిక్ పోస్టులకు మొత్తం 743 పోస్టులు నోటిఫై చేయగా.. ఇందులో 710 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. డ్రైవర్ పోస్టులకు హాజరైన అభ్యర్థుల డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్లు వారి వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు వెల్లడించింది.
వెబ్సైట్లో సెలక్షన్ జాబితాలు
తుది ఎంపిక జాబితాలతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన కటాఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. అయితే ఈ ఎంపిక తుది నియామకానికి హామీ కాదని స్పష్టం చేసింది. అభ్యర్థుల క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్, ప్రవర్తన ధృవీకరణ, అలాగే వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే నియామక ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 11 అర్ధరాత్రి వరకు డిజిటల్ విధానంలో అటెస్టేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపాలని బోర్డు సూచించింది.
అనంతరం ఆగస్టు 17న మూడు కాపీల అటెస్టేషన్ ఫారాలు, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి సంబంధిత పోలీసు జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయాల్లో సమర్పించాలని తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేసి, తదుపరి నియామక ప్రక్రియకు సహకరించాలని బోర్డు సూచించింది.
తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.