Reading Time: 2 minutes
Sheikh Hasina First Public Appearance Delhi Bangladesh Return Plan

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ వారం తొలిసారి బహిరంగ కార్యక్రమంలో కనిపించే అవకాశం ఉంది. ఢాకాలో విద్యార్థుల ఉద్యమం కారణంగా ఆమె ప్రభుత్వం కూలిపోయి భారత్‌కు వచ్చిన తర్వాత.. దాదాపు రెండేళ్లకు ఆమె ప్రజల ముందుకు రానున్నారు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న షేక్ హసీనా 2024 ఆగస్టు 5 నుంచి భారత్‌లో నివసిస్తున్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో షేక్ హసీనా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు సర్ మార్క్ టల్లీ ఆడిటోరియంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని క్లబ్ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రణాళికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, బంగ్లాదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి నౌఫెల్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది డిసెంబర్‌లో షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు త్వరలోనే తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఢాకా కోర్టు తనకు మరణశిక్ష విధించినప్పటికీ స్వదేశానికి వెళ్లాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. భారత్ నుంచి తిరిగి వెళ్లాలనే విషయంలో న్యూఢిల్లీ నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. భారత్‌లో తనకు తగిన గౌరవం, మర్యాద లభిస్తున్నాయని కూడా తెలిపారు. గత వారం ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో.. తన స్వంత నిర్ణయంతోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు షేక్ హసీనా పేర్కొన్నారు. ‘‘నన్ను చంపవచ్చు. అరెస్టు చేయవచ్చు. జైలుకు పంపవచ్చు. నాకు ఎదురయ్యే పరిణామాల గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ నేను తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను తిరిగి రావాలని పిలుస్తున్నారు’’ అని హసీనా వ్యాఖ్యానించారు. గత నెలలో ఇచ్చిన మరికొన్ని ఇంటర్వ్యూలలో.. ఈ ఏడాది చివరి నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశంపై తన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు హసీనా వెల్లడించారు.

షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు చేరుకున్న వెంటనే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఎం. అసదుజ్జమాన్ గత వారం వెల్లడించారు. కోర్టు ముందు స్వయంగా లొంగిపోయే అవకాశం రాకముందే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు హసీనా ఏఎఫ్‌పీకి చెప్పిన ఒక రోజు తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హసీనాకు బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే హక్కు ఉందని అసదుజ్జమాన్ పేర్కొన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటుందని, చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు.

‘‘ఆమెకు మరణశిక్ష విధించబడినప్పటికీ.. బంగ్లాదేశ్ పౌరురాలిగా చట్టాన్ని గౌరవిస్తూ స్వదేశానికి వచ్చి కోర్టు ముందు లొంగిపోవాలని అనుకుంటే.. ఆమెకు ఆ అవకాశం రాకముందే అరెస్టు చేసే పరిస్థితి ఉండొచ్చు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. చట్టం తమకు ఇచ్చిన అధికారాలను ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వం హసీనా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఆమె బంగ్లాదేశ్‌కు ఎలా తిరిగి వస్తారని ప్రశ్నించగా.. అది ఆమె సమస్య అని మంత్రి సమాధానమిచ్చారు. ‘‘ఆమె మా దేశ భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే చట్టం నాకు ఇచ్చిన అధికారాలను అమలు చేస్తాను’’ అని అసదుజ్జమాన్ పేర్కొన్నారు.

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఆమె బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా హసీనా రాజకీయ పార్టీ అవామీ లీగ్‌ను రద్దు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలను అణచివేసిన ఘటనలో తన పాత్రకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై.. 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ షేక్ హసీనాకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. తనపై నమోదైన కేసులు రాజకీయ ఉద్దేశాలతో రూపొందించినవని షేక్ హసీనా ఆరోపణలను తోసిపుచ్చారు.

1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో పాకిస్థాన్ సైన్యానికి సహకరించిన వారిపై విచారణ జరిపేందుకు 2010లో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం హసీనాపై విచారణ చేపట్టేందుకు ట్రైబ్యునల్ పరిధిలో మార్పులు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల మధ్య.. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అంశంపై షేక్ హసీనా తీసుకునే నిర్ణయం దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.