
Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పట్టు సడలుతోందా? ఒక ఏడాది క్రితం వరకు బీసీసీఐ (BCCI)లో ఆయనకు ఉన్న ప్రాబల్యం, హోదా ఇప్పుడు తగ్గుముఖం పట్టాయా? అంటే అవుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘cricblogger.com’ ప్రచురించిన కథనం ప్రకారం.. వరుసగా కొన్ని కీలకమైన మ్యాచ్లలో ఓటముల తర్వాత గంభీర్ నిర్ణయాలు, ఆయన కోచింగ్ శైలిపై బోర్డులో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు గంభీర్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాదు.. బీసీసీఐకి సైతం ఫిర్యాదు చేశారని సమాచారం. ఓటములకు స్వయంగా బాధ్యత వహించడానికి బదులుగా సపోర్ట్ స్టాఫ్ లేదా ఆటగాళ్లపై నెట్టేయడంపై బీసీసీఐ అధికారులు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
గంభీర్కు వ్యతిరేకంగా మారుతున్న వాతావరణం?
బోర్డులోని కొందరు అధికారుల అభిప్రాయం ప్రకారం.. గంభీర్ తరచూ ఓటములకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లేదా సపోర్ట్ స్టాఫ్ను బలిపశువులను చేస్తుంటారు. ఇప్పటికీ బీసీసీఐ నుంచి గంభీర్కు కొంత మద్దతు ఉన్నప్పటికీ, తనకు లభించిన పూర్తి స్వేచ్ఛను, నియంత్రణను ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని కొందరు భావిస్తున్నారు. తనకిష్టమైన సపోర్ట్ స్టాఫ్ను ఎంచుకునే అవకాశం లభించినా, తుది నిర్ణయాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని విమర్శలు వస్తున్నాయి.
గంభీర్కు ఉన్న ఒకే ఒక్క ఊరట:
బీసీసీఐ మనస్తత్వం క్రమంగా మారుతుండటంతో రాబోయే శ్రీలంక పర్యటన గంభీర్కు అత్యంత కీలకమైన అగ్నిపరీక్షగా మారింది. ఇందులోనూ విఫలమైతే ఆయన పదవిపై మరిన్ని ప్రశ్నలు రావడం ఖాయం. అయితే, టెస్టుల్లో వరుస ఘోర ఓటములు, ఇటీవల ముగిసిన యుకే (UK) పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన ఎదురైనప్పటికీ.. గంభీర్కు ఒక పెద్ద ఊరట లభించే అంశం ఉంది. అదేంటంటే, బీసీసీఐతో ఆయనకు 2027 వరకు ఉన్న కాంట్రాక్ట్. వన్డే వరల్డ్ కప్కు ఇంకా ఏడాది సమయం కూడా లేని నేపథ్యంలో, బీసీసీఐ వంటి ప్రతిష్టాత్మక బోర్డు ఎంత ఒత్తిడి ఉన్నా ప్రధాన కోచ్ను సడన్గా తొలగించే సాహసం చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.