
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా రవాణా చేసే వ్యవస్థను ప్రారంభించనుంది. మెడికల్ సామాగ్రి, వస్తువులు, ఇతర వస్తువులను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు ముందడుగు వేసింది. ఇందుకోసం ఏరోస్సేస్ స్టార్టప్ సంస్థ ఎయిర్బౌండ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు 10 వేల డ్రోన్ విమానాలను నిర్వహించాలని ఈ స్టార్టప్ యోచిస్తోంది. ఎయిర్బౌండ్ సంస్థ రాబోయే సంవత్సరంలో రోజుకు 10 వేల డ్రోన్ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకుంది. రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సమక్షంలో ఎంవోయూపై సంతకం చేశారు.
ప్రత్యేక డ్రోన్ కారిడార్లు..
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరోగ్య సంరక్షణ సామాగ్రి, ఈ-కామర్స్ డెలివరీలు, వాణిజ్య సరుకుల కోసం ప్రత్యేక డ్రోన్ కారిడార్లను సృష్టించనుంది. ప్రత్యేక డ్రోన్ కారిడార్లను సృష్టించడం ద్వారా ఒక సమీకృత వైమానిక లాజిస్టిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. అమరావతి, విజయవాడ, గుంటూరును అనుసంధానించేలా ఈ కారిడార్ ఉండనుంది. గుంటూరుతో ప్రారంభించి దశలవారీగా అమలు మొదలయ్యే ఈ ప్రాజెక్ట్లో ఎయిర్బౌండ్ సంస్థ ఆరోగ్య సంరక్షణ , లాజిస్టిక్స్, ఇ-కామర్స్ రంగాలలోని భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. ఈ అమలులో పైలట్ కార్యకలాపాలు, రూట్ మ్యాపింగ్, నియంత్రణ సమన్వయం, అమరావతి రాజధాని ప్రాంతం అంతటా పరస్పరం అనుసంధానించబడిన డ్రోన్ కారిడార్ల అభివృద్ధి వంటివి ఉంటాయి.
కార్బన్ ఫైబర్ తయారీ..
TRT అని పిలువబడే వారి బ్లెండెడ్-వింగ్-బాడీ టెయిల్సిట్టర్ విమానం 1.5 కిలోల బరువు ఉంటుంది. దీనిని తేలికపాటి కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. ఈ డ్రోన్ ద్వారా డెలివరీ ఖర్చులను కిలోమీటరుకు 10 పైసల వరకు తగ్గించవచ్చు.ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఐఏఎస్ అధికారిణి గీతాంజలి శర్మ మాట్లాడుతూ..ఈ అవగాహన ఒప్పందంతో ఎయిర్బౌండ్ కేవలం ఒక కొత్త డెలివరీ విధానాన్ని ప్రారంభించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త లాజిస్టిక్స్ వ్యవస్థకు పునాదులు వేస్తోందని అన్నారు. ఈ భాగస్వామ్యం తదుపరి తరం విమానయాన రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని చూపిస్తుందని, దీని ద్వారా అనుసంధానం, ఉద్యోగాలు, వృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.