Reading Time: 2 minutes

Padma Awards 2026: కనులపండువగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం: మమ్ముట్టికి ‘పద్మభూషణ్’.. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు ‘పద్మశ్రీ’

Caption of Image.

ఢిల్లీ వేదికగా దేశ అత్యున్నత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం కనులపండువగా సాగింది. రాష్టపతి భవన్‌లోని దర్బార్ హాల్‌.. వివిధ రంగాల దిగ్గజాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులను అందజేశారు. ఈ ఏడాది (2026) రెండు విడతలుగా ఈ వేడుక నిర్వహించగా.. మొన్న 66 మంది, నేడు మరో 47 మంది ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో పాటు వెండితెర సృజనకారులు తమ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా పద్మ అవార్డులను సొంతం చేసుకున్నారు.

మెగాస్టార్ మమ్ముట్టికి ‘పద్మభూషణ్’.. 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి. నారాయణన్, పద్మవిభూషణ్ ను అందుకున్నారు. అటు అల్కాయాగ్నిక్ తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఐదు దశాబ్దాలుగా, 400లకు పైగా చిత్రాల్లో వైవిధ్యభరిత నటనతో అలరిస్తున్న మలయాళ లెజెండ్ మమ్ముట్టిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఆయన అవార్డు తీసుకుంటున్న సమయంలో.. సదస్సులో కూర్చున్న ఆయన కుమారుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కళ్ళల్లో ఆనందంతో కనిపించారు.. తండ్రిని చూస్తూ దుల్కర్ చప్పట్లతో మురిసిపోయిన హార్ట్-టచింగ్ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

 

టాలీవుడ్ లెజెండ్స్..  ‘పద్మశ్రీ’ వైభవం..

తెలుగు సినిమా నవ్వుల రేడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు, సీనియర్ నటుడు మాగంటి మురళీ మోహన్ కళారంగంలో చేసిన సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.

 

వీరితో పాటు, వెండితెరపైనే కాకుండా ఆర్గానిక్ హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలోనూ రాణిస్తున్న వర్సటైల్ యాక్టర్ఆర్. మాధవన్ కూడా పద్మశ్రీని సొంతం చేసుకున్నారు. అలాగే క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు.

 

తెలుగు రాష్ట్రాల పద్మ కిరణాలు

ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు మెరిశారు. వారిలో తెలంగాణ ఏడుగురు పద్మశ్రీ గ్రహీతలైన గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్), దీపికా రెడ్డి (నృత్యం), గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (మరణానంతరం-పశుసంవర్ధక శాఖ). ఢిల్లీ కోటాలో యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌కు కూడా పద్మశ్రీ దక్కింది.

►ALSO READ | అసెంబ్లీలో పుష్ప స్టైల్‌లో విజయ్ సైగ.. స్టాలిన్ మార్క్ గెస్టర్‌తో డీఎంకేకు దళపతి మాస్ కౌంటర్!

ఆంధ్రప్రదేశ్ నుంచి నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లతో పాటు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం) ఈ గౌరవాన్ని అందుకున్నారు. కళాకారుల ప్రతిభకు, సమాజ సేవకు దక్కిన ఈ గౌరవం యావత్ సినీ లోకానికి గర్వకారణం అని పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. సినిమా గ్లామర్, సామాజిక సేవ, సైన్స్ ప్రతిభ కలగలిసి.. ఈ ఏడాది పద్మ పురస్కారాల వేడుక దేశ చరిత్రలో ఒక మరుపురాని క్రేజీ చాప్టర్‌గా నిలిచిపోయింది.

ఈ పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షేకావత్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.