
Ram Charan to Attend APL 2026 Opening in Mangalagiri: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 చివరి దశకు రంగం సిద్ధమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్లో తొలి దశ విశాఖపట్నంలో, రెండో దశ కడపలో విజయవంతంగా నిర్వహించగా.. చివరి దశ మ్యాచ్లకు అమరావతి ఆతిథ్యం ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది.
ఏపీఎల్ చరిత్రలో తొలిసారిగా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి ఏసీఏ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్టేడియాన్ని అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేశారు. లీగ్ చివరి దశలో మొత్తం 12 మ్యాచ్లు మంగళగిరిలో జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం రెండు మ్యాచ్ల చొప్పున అభిమానులను అలరించనున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో చివరి దశ పోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లపై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఏపీఎల్ ప్రారంభ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. చరణ్ రాకతో టోర్నీకి మరింత ఆకర్షణ ఏర్పడింది. ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27తో లీగ్ దశ ముగియనుండగా, జూన్ 28 నుంచి ప్లేఆఫ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్తో ఏపీఎల్ సీజన్-5 ముగియనుంది. ఫైనల్ మ్యాచ్కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. క్రికెట్, వినోదం, సెలబ్రిటీ సందడి కలగలిపిన ఏపీఎల్ సీజన్-5 చివరి దశకు మంగళగిరి వేదిక కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈ స్థాయి క్రికెట్ టోర్నీ జరగడం ఆంధ్ర క్రికెట్ చరిత్రలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.