Reading Time: < 1 minute
Saikrishna Death Case Mother Alleges Police Torture By Ci Nagaraju In Vijayawada

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు సాయికృష్ణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందాడంటూ అతడి తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లేఖ అందజేయగా.. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి చంపిన సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చినట్లు విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన కుమారుడిని చూపించకుండా సీఐ నాగరాజు తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. తన కుమారుడి గురించి అడిగినప్పుడు ‘నీ కొడుకుని చంపేస్తాను.. ఫోటోకు దండ సిద్ధం చేసుకో’ అంటూ హెచ్చరించాడని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణను కొడుతున్నప్పుడు అతడి అరుపులు వినిపించాయని, అనంతరం పై అంతస్తుకు వెళ్లి కుమారుడిని చూసినట్లు కూడా విజయలక్ష్మి వివరించారు. అంతేకాకుండా స్టేషన్‌లోనే తన కుమారుడికి తీవ్ర చిత్రహింసలు పెట్టి హత్య చేసి, ఆ తర్వాత మృతదేహం ఆనవాళ్లు లేకుండా కాల్చివేసినట్లు తనకు సమాచారం అందిందని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం కోసం బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు.

సీఐ నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ నెల 19న నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందజేయగా.. కమిషనర్ ఎండార్స్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయికృష్ణ మృతి వ్యవహారం ప్రస్తుతం విజయవాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.