Reading Time: 2 minutes
Virat Kohli Rules Out Test Cricket Comeback One8 Launch Event

Virat Kohli: భారత రన్ మెషీన్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరదించాడు. తాను మళ్లీ టెస్టు ఫార్మాట్‌లోకి పునరాగమనం చేసే ప్రసక్తే లేదని అత్యంత స్పష్టంగా ప్రకటించాడు. “టెస్టు క్రికెట్‌తో నా ప్రయాణం ముగిసిపోయింది.. ఐ యామ్ డన్ విత్ ఇట్” అంటూ కోహ్లీ తేల్చిచెప్పాడు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తన సొంత స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ ‘one8’ లాంచ్ ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హోస్ట్, కమెడియన్ డానిష్ సైత్ కోహ్లీని సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ‘one8’ బ్రాండ్‌కు చెందిన ఒక షూ ధర 9,230 రూపాయలుగా ఉండటాన్ని డానిష్ గమనించాడు. విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో చేసిన మొత్తం పరుగులు కూడా సరిగ్గా 9,230 కావడంతో.. “ఈ షూ సేల్స్, కంపెనీ లాభాలను మరింత పెంచడం కోసమైనా.. మీరు మళ్లీ టెస్టుల్లోకి వచ్చి మరికొన్ని పరుగులు చేయకూడదా?” అని డానిష్ సరదాగా ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ అంతే హాస్యస్ఫురతంగా స్పందిస్తూ.. “ఆ ధర కంటే తక్కువ ధరకే అమ్ముకోవడానికి నేను సిద్ధం కానీ.. టెస్టు క్రికెట్‌తో నా పని అయిపోయింది. థాంక్యూ” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గత ఏడాది (2025) మే నెలలో కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సాగిన అతని 14 ఏళ్ల సుదీర్ఘ అద్భుతమైన టెస్టు కెరీర్ ముగిసింది.

విరాట్ కోహ్లీ తన అద్భుతమైన టెస్టు కెరీర్‌లో మొత్తం 123 మ్యాచ్‌లు ఆడి 210 ఇన్నింగ్స్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రావిడ్ (13,265 పరుగులు), సునీల్ గవాస్కర్ (10,122 పరుగులు) తర్వాత కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా 2016 నుంచి 2019 మధ్య కాలంలో కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరిచాడు. ఆ నాలుగేళ్లలో కేవలం 43 టెస్టుల్లోనే 66.79 అద్భుత సగటుతో 4,208 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక కెప్టెన్‌గా అత్యధికంగా 7 డబుల్ సెంచరీలు బాదిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. బ్యాటింగ్‌లోనే కాకుండా టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కూడా కోహ్లీ తిరుగులేని రికార్డులను సృష్టించాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఎంఎస్ ధోనీ గాయపడటంతో మొదటిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. ఆ తర్వాత భారత అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా అవతరించాడు. అతని సారథ్యంలో భారత్ ఆడిన 68 టెస్టుల్లో ఏకంగా 40 మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించింది.