Reading Time: 2 minutes
Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా భారీగా వానలు పడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరు వరకు భారీగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. నేడు పోలవరం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామాజు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వానలు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నెల 26 నుంచి వర్షాలు

అటు ఈ నెల 26,27వ తేదీల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఈ నెల 26 వరకు జల్లులు పడతాయని, రాయలసీమలో ఈ నెల 26 వరకు ఉరుములతో కూడిన వానలు పడతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణలో మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశముంది. జూన్ 24న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జూన్ 25న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. అటు జూన్ 26వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు సోవవారం నుంచి మంగళవారం రాత్రి వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌ మండలం కూనారంలో అత్యధికంగా 17.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  అటు ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో బలపడుతోంది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది. ఎల్‌నివో ముప్పు వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.