
న్యూఢిల్లీ: నిరాధార ఆరోపణలు చేయడం.. ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోవడం పొరుగు దేశం పాకిస్తాన్కు అలవాటే. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తేలింది. ఎందుకంటే.. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఒక్క రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా కోల్పోలేదు. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వెల్లడించిన వివరాలే ఇందుకు సాక్ష్యం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు ప్రస్తుతం అన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఐఏఎఫ్ స్పష్టం చేసింది.
2016లో అంతర ప్రభుత్వ ఒప్పందం కింద ఫ్రాన్స్ నుంచి ఇండియా 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. ఈ 36 యుద్ధ విమానాల మెయింటైనెన్స్ కాంట్రాక్ట్ 2026, సెప్టెంబర్ 18తో ముగియనుంది. దీంతో రాబోయే ఐదేళ్ల కాలానికి దీర్ఘకాలిక ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్ లాజిస్టిక్స్’ (PBL) ఒప్పందాన్ని ఐఎఎఫ్ ఖరారు చేయాల్సి ఉంది.
అయితే, ఈ అగ్రిమెంట్ కుదిరే లోపు విమానాల నిర్వహణలో ఎలాంటి అంతరాయం రాకుండా ఉండేందుకు ఐఏఎఫ్ తాత్కాలిక బ్రిడ్జ్ సపోర్ట్ ప్యాకేజీని రూపొందించింది. ఈ మేరకు భారత ఎయిర్ హెడ్క్వార్టర్స్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. దీని ప్రకారం.. 2026, సెప్టెంబర్ 18 తర్వాత ఐదు నెలల పాటు ఈ తాత్కాలిక బ్రిడ్జ్ సపోర్ట్ అమలులో ఉంటుంది. ఈ ప్రతిపాదనను రఫేల్ ఇంజిన్ల ఒరిజినల్ తయారీ సంస్థ ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ఐఏఎఫ్ పంపింది.
అయితే, బ్రిడ్జ్ సపోర్ట్ ప్యాకేజీలో 36 యుద్ధ విమానాల మెయింటైనెన్స్ కోసం ఐఏఎఫ్ సహయం కోరింది. ఇందులో ఐఏఎఫ్ పేర్కొన్న విమానాల సంఖ్య తొలుత ఫ్రాన్స్ నుంచి కొన్న మొత్తమే (36) ఉండటంతో ఒక్క రఫేల్ కూడా మనం కోల్పోలేదని తెలుస్తోంది. దీని భట్టి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఒక్క రఫేల్ ఫైటర్ జెట్ ను కోల్పోలేదని.. పాకిస్తాన్ చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనని తేటతెల్లమైంది.