
“ఇవ్వాళ నేను మీ ముందుకు ఒక స్టార్ హీరో లాగానో, లేదా ఒక ప్రజాప్రతినిధిగానో రాలేదు.. కేవలం ఒక కొడుకుగా మాత్రమే మీ ముందు నిలబడ్డాను” అంటూ నందమూరి బాలకృష్ణ అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జుబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన తల్లి స్మారకార్థం పేదల కోసం నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఉన్న నేపథ్యాన్ని, గత 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఆసుపత్రి ఆవిర్భావం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఆనాడు మా అమ్మ క్యాన్సర్ బాధితురాలిగా ఉన్నప్పుడు.. ఆమె అడిగిన ఒకే ఒక్క ప్రశ్న వల్ల పుట్టిందే ఈ ఆసుపత్రి. అమ్మకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ పరిస్థితిని, ఆర్థిక ఖర్చులను మా కుటుంబం తట్టుకోగలిగింది. కానీ, పేదలు అందరూ ఆ భారాన్ని భరించలేరు కదా! అందుకే, నిరుపేదల కోసం ఒక ప్రత్యేకమైన క్యాన్సర్ ఆసుపత్రి రావాలన్నది అమ్మ చివరి కోరిక. మేము మొదట ఈ ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. కేవలం 100 బెడ్స్ తో చాలా చిన్నగా దీనిని ప్రారంభించాం” అని వివరించారు.
అయితే నేడు అదే బసవతారకం ఆసుపత్రి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అత్యాధునిక స్క్రీనింగ్ మరియు అంతర్జాతీయ స్థాయి వైద్య పద్ధతులతో సేవలు అందిస్తోందని బాలయ్య గర్వంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఏకంగా 3.75 లక్షల మందికి పైగా రోగులకు కేవలం ఓపీ (OP) సేవలు అందించడం విశేషం. ఈ మహత్కార్యం వెనుక ఎందరో మహానుభావుల శ్రమ దాగి ఉందన్న బాలయ్య.. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి.. నేటి తెలంగాణ ప్రభుత్వం వరకు, పాలకుల అందిస్తున్న సహకారం నిజంగా మరువలేనిది. ప్రభుత్వాల అండతోనే ఎంతోమందిని క్యాన్సర్ మహమ్మారి నుండి క్షేమంగా బయటకు తీసుకురాగలిగాం. కేవలం మన తెలుగు రాష్ట్రాలే కాదు.. ఇక్కడి వైద్య సేవలను నమ్మి ప్రపంచ దేశాల నుండి కూడా బాధితులు వస్తున్నారు. నా అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, దాతలు ఎంతోమంది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వెనుక నిలబడ్డారు. ఇక రాత్రి పగలు శ్రమిస్తున్న మా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, నాన్-మెడికల్ స్టాఫ్.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పి వారి సేవలను తక్కువ చేయదలచుకోలేదు” అని పేర్కొన్నారు.
“డబ్బులు లేవు అనే ఒకే ఒక్క కారణంతో వైద్య సేవలు అందకుండా ఏ ఒక్క రోగీ ఈ ఆసుపత్రి గుమ్మం నుండి వెనక్కి వెళ్లే అవకాశమే లేదు! బసవతారకం ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి క్యాన్సర్పై గెలిచే వరకు.. వారి ముఖంలో సంతోషకరమైన నవ్వు చూసేవరకు మా సేవలు ఇలాగే నిరంతరాయంగా కొనసాగుతాయి” అని బాలయ్య సంచలన ప్రకటన చేశారు. పేదల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా సాగుతున్న బసవతారకం ఆసుపత్రి ప్రస్థానంపై బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.