Reading Time: < 1 minute

పొరపాటున పాక్ బోర్డర్ దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Caption of Image.

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించింది. దాదాపు 2 నిమిషాల పాటు పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టి ఆ తర్వాత తిరిగి వచ్చింది. ఈ ఘటన 2026, జూన్ 22వ తేదీన జరిగింది. ఎయిర్ ఇండియా సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే..? 

జూన్ 22వ తేదీన ఎయిర్ ఇండియాకు చెందిన AI479 విమానం ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు టేకాఫ్ అయ్యింది. అయితే, అమృత్‌సర్ రీచ్ అయ్యాక విమానశ్రయంలో తీవ్రమైన ఎయిర్ ట్రాఫిక్ కారణంగా ల్యాండింగ్‎కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో విమానం గో-అరౌండ్ (మళ్లీ గాల్లోకి ఎగరడం) చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విమానం అటారీ సమీపంలో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. 

దాదాపు రెండు నిమిషాల పాటు పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వెంటనే ఈ విమాన గమనాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో.. పైలట్ యు-టర్న్ తీసుకుని తిరిగి భారత గగనతలంలోకి సురక్షితంగా ప్రవేశించారు. అప్పటికీ కూడా అమృత్ సర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్‎కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం సేఫ్‎గా ల్యాండ్ అయ్యింది. 

ఈ ఘటనను ఎయిర్ ఇండియా ధృవీకరించింది. జూన్ 22న ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న AI479 విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో గో-అరౌండ్ చేస్తోన్న క్రమంలో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ విషయాన్ని డీజీసీఏకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని.. విచారణ పూర్తయ్యే వరకు సదరు పైలట్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. 

 

©️ VIL Media Pvt Ltd.