
Heavy Rains: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ అంతటా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఉష్ణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కాస్త మందకొడిగా సాగిన పవనాలు.. జూన్ 8న రాష్ట్రాన్ని తాకినప్పటికీ, తెలంగాణను పూర్తిగా కమ్మేయడానికి దాదాపు 15 రోజుల సమయం తీసుకున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో ఏకంగా 17.1 సెం.మీల వాన పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా.. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో వానలు దంచికొట్టాయి. వీటితో పాటు సంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం పగటిపూట కూడా వర్షాలు ఊపందుకున్నాయి. రాబోయే బుధ, గురు, శుక్రవారాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 24న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు జోరుగా సాగనున్నాయి. ఆ మరుసటి రోజు (25వ తేదీన) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 26వ తేదీన ఈ ప్రాంతాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.