
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ జూన్ 2026) పరీక్షలు సోమవారం (జూన్ 22)తో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేసుకోంగా.. ఇందులో 1,15,028 మంది అంటే 74.81శాతం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. 38,724 మంది ఈ పరీక్షకు గైర్హాజరయ్యారు. జూన్ 14 నుంచి 22 వరకు రోజుల పాటు మొత్తం పది సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు నిర్వహించారు. జులై 28 నుంచి 31 మధ్యలో ఫలితాలు విడుదల కానున్నాయి.
టీజీ టెట్ పరీక్షలు ముగియడంతో ప్రాథమిక కీల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. ఈ ప్రాథమిక కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని జూలై 2వ తేదీ లోపు వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు గడువులోగా తమ అభ్యంతరాలను తగిన ఆధారాలతో అధికారిక పోర్టల్లో నమోదు చేస్తే.. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఆన్సర్ కీ రూపొందించి జూలై 28 నుంచి 31 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేస్తారు.
ప్రభుత్వ బడుల్లో ఖాళీగా 14, 171 టీచర్ పోస్టులు
మరోవైపు సర్కార్ బడుల్లో 14, 171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27వేల స్కూ ళ్లుండగా మొత్తంగా 1,26,820 టీచర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 1,13,057 టీచర్లు పనిచేస్తున్నారు. ఇక 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు సైతం పెరుగుతుండటంతో.. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.