
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి దీక్షలోకి ప్రవేశించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆధ్యాత్మిక జీవనానికి అంతే ప్రాధాన్యం ఇస్తుంటారు పవన్ కళ్యాణ్.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తన ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించారు. బుధవారం ఉదయం మంగళగిరి పానకాల స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఏటా ఆచరించే దీక్షను ప్రారంభించారు. జ్యేష్ఠ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొనసాగే ఈ దీక్ష వెనుక ఉన్న విశిష్టత ఏంటి..? పవన్ పాటించే నియమాలు ఏంటి..? చూద్దాం…
ఏటా ఆధ్యాత్మిక సాధన
గురుముఖంగా స్వీకరించిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏటా ఈ దీక్ష చేపడుతుంటారు. జ్యేష్ఠ మాసంలో ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక సాధన కార్తీక మాసం వరకు కొనసాగుతుంది.
నియమ నిష్ఠలతో దీక్ష
దీక్ష కాలంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం, నిత్య అనుష్ఠానాలు నిర్వహించడం, దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేయడం వంటి కఠిన నియమాలను పవన్ కళ్యాణ్ పాటిస్తారు. విధి నిర్వహణకు అనుగుణంగా సాధారణ జీవనం కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయిస్తారు.
దీక్ష సమయంలో ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణలో కనిపించే పవన్ కళ్యాణ్… రాజకీయ బాధ్యతల మధ్య కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ దీక్షను కొనసాగించడం ఆయన ఆధ్యాత్మిక విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..