Reading Time: < 1 minute
Peddi Success Meet Ram Charans Mega Blockbuster Event In Hyderabad Chiranjeevi To Attend

Peddi Success Meet : భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకు సక్సెస్ వేడుక మరింత ప్రత్యేకంగా ఉండాలంటే అభిమానులకు సర్‌ప్రైజ్‌లు కూడా అవసరమే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ టీమ్ కూడా అలాంటి గ్రాండ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ వేడుకకు రానున్న స్పెషల్ గెస్ట్ ఎవరనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ కెరీర్‌లో మరో విభిన్నమైన పాత్రగా నిలిచిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ, బుచ్చి బాబు టేకింగ్, రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ విజయపథంలో దూసుకెళ్తోంది.

ఈ విజయాన్ని అభిమానులతో కలిసి జూన్ 23న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి “మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్” పేరిట సెలబ్రేట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథి హాజరుకానున్నారని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. అయితే ఆ అతిథి ఎవరో మాత్రం ఇప్పటివరకు గోప్యంగానే ఉంచారు. అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో కీలక చిత్రంగా నిలుస్తున్న ‘పెద్ది’ విజయాన్ని మెగాస్టార్ స్వయంగా అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసే అవకాశం ఉందనే వార్తలు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.