Reading Time: 2 minutes
Mahua Moitra Praises Suvendu Adhikari Recalls Support After Lok Sabha Ticket Setback

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలతో సతమతం అవుతున్న మమతా బెనర్జీ.. ఇప్పుడు సన్నిహితురాలు మహువా మొయిత్రా వ్యాఖ్యలు చూస్తుంటే ఈమె కూడా ప్లేట్‌ ఫిరాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆమె మాట్లాడిన వ్యాఖ్యలే ఉదాహరణగా ఉన్నాయి. 2014లో లోక్‌సభ టికెట్ రానప్పుడు ఆ రాత్రంతా ఏడ్చానని.. అప్పుడు సువేందు అధికారి మాత్రమే తనకు అండగా నిలిచారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆమె స్వరం మారుతోందని అర్థమవుతోంది.

ఒక ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ.. తాను, సువేందు అధికారి ఇద్దరూ టీఎంసీలో ఉన్న సమయంలో తనకు ఆయన ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తనకు పార్టీ టికెట్ వస్తుందని భావించినప్పటికీ చివరి క్షణంలో అవకాశం దక్కలేదని మహువా వెల్లడించారు. ఆ రాత్రంతా తాను ఏడ్చానని… ఆ సమయంలో తనను ఓదార్చిన వ్యక్తి సువేందు అధికారి అని గుర్తుచేశారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో తాను తొలిసారి కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భాన్ని కూడా మహువా గుర్తు చేసుకున్నారు. ‘‘నేను కరీంపూర్ నుంచి మొదటిసారి పోటీ చేసినప్పుడు నా కోసం ప్రచారానికి పెద్దగా ఎవరూ రాలేదు. నా తొలి ఎన్నికల ర్యాలీని నిర్వహించింది సువేందు అధికారి. ఇప్పటికీ ఆ ఫొటోలు ఉన్నాయి. ఆ వేదికపై నేను, సువేందు మాత్రమే ఉన్నాం.’’ అని చెప్పారు. 2020లో టీఎంసీని వీడి సువేందు అధికారి బీజేపీలో చేరినప్పటి నుంచి తమ మధ్య రాజకీయ దూరం పెరిగిందని మహువా పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు. మేము మాట్లాడుకోవడం లేదు. కానీ ఆయన నాకు చేసిన సహాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.’’ అని తెలిపారు.

‘‘టీఎంసీ బలహీనత ఏమిటంటే.. ఉపయోగం లేని నాయకులను కూడా పార్టీ కొనసాగించింది. వారు స్వతంత్రంగా ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం కలిగి ఉన్నారా లేదా అన్నది సమీక్షించాల్సి ఉండేది.’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యవస్థపై కూడా మహువా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బలమైన క్యాడర్ ఉందని.. పార్టీ క్రమబద్ధంగా పనిచేస్తుందన్నారు. స్పష్టమైన హిందుత్వ సిద్ధాంతం ఉందని.. ఆ పార్టీ ఒక్క వ్యక్తిపై ఆధారపడదని పేర్కొన్నారు.

టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని మహువా పూర్తిగా ఖండించారు. ‘‘టీఎంసీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ప్రశ్నే లేదు. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి.