Reading Time: 2 minutes
Stampede Scare At Ranchi Stadium During Jharkhand T20 Final Fans Injured

Stampede Scare at Ranchi Stadium: ఐపీఎల్ 2025 ఫైనల్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ట్రోఫీని గెలుచుకోవడంతో.. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాదకర సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అలాంటి ఘటనే దేశంలో మరొకటి చోటుచేసుకుంది. ఝార్ఖండ్ టీ20 లీగ్ 2026 ఫైనల్ సందర్భంగా రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట తొక్కిసలాట చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో కొందరు అభిమానులు గాయపడ్డారు. పోలీసులు క్షగాత్రులను సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మంగళవారం (జూన్ 23) జంషెడ్‌పూర్ స్టీలర్స్‌, చోటా నాగ్‌పూర్ రాయల్స్ తలాడ్డాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వేలాది మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే ప్రేక్షకుల ప్రవేశానికి వెస్ట్ గేట్ మాత్రమే తెరిచి ఉంచడంతో.. భారీ రద్దీ ఏర్పడింది. అదే సమయంలో భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న అభిమానుల్లో అసహనం పెరిగింది. దీంతో ఒక్కసారిగా తోపులాట, నెట్టుకొనే పరిస్థితి ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.

గేట్ వద్ద అభిమానులు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానుల ఒత్తిడికి స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, గేట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదనపు భద్రతా బలగాలను మోహరించి.. అభిమానులను వరుసగా స్టేడియంలోకి అనుమతించారు. దీంతో కొద్దిసేపటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అనంతరం ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరిగింది.

ఈ ఘటనపై రాంచీ ఎస్‌ఎస్‌పీ రాకేశ్ రంజన్ మాట్లాడుతూ.. ‘అభిమానుల ప్రవేశానికి ఒక్క గేట్ మాత్రమే తెరిచి ఉండటంతో భారీ రద్దీ ఏర్పడింది. సెక్యూరిటీ తనిఖీల కారణంగా ఏంటి ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. కొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది’ అని తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు కమల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో రావడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, అయితే భద్రతా సిబ్బంది సహకారంతో వెంటనే అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు. గాయపడిన వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటన మరోసారి మైదానాల వద్ద ప్రేక్షకుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తింది.