
ఈయన మామూలు డాక్టర్ కాదు. పెళ్లయి ఏండ్లకు ఏండ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానం కలిగిస్తానని చెప్పి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నాడు. అసలు డాక్టరే కాదు.. ఎలాంటి పట్టా లేదు.. చదువుకున్న ఆధారాలు లేవు. అయినా డాక్టర్నంటూ అమాయకులను మోసం చేస్తున్నాడు. మేడ్చల్ జిల్లాలో పట్టుబడిన ఈ నకిలీ డాక్టర్ గురించి మీరే తెలుసుకోండి.
ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు పెంటయ్యను కుత్బుల్లాపూర్ ఎస్వోటీ పోలీసులు సోమవారం (జూన్ 22) అదుపులోకి తీసుకున్నారు. మెడిసిన్ చదవకపోయినా.. వేరే వైద్యురాలి సర్టిఫికెట్లతో యదేచ్ఛగా వ్యాపారం చేస్తున్నాడు.
మేడ్చల్ లో శివరామకృష్ణ డే కేర్ సెంటర్ పేరిట పెంటయ్య హాస్పిటల్ నడుపుతున్నాడు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా సంతానం లేని వారికి కలిగేటట్టు చేస్తానని ఇంజక్షన్ ఇస్తూ వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నాడు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు పాటించకుండా మెడికల్ షాప్ తో పాటు అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తున్నాడు.
►ALSO READ | సికింద్రాబాద్ రసూల్ పురలో డ్రగ్స్ కలకలం.. రూ. 1.53 లక్షల ఎండిఎంఏ పట్టివేత..
ఈ మేరకు కుత్బుల్లాపూర్ ఎస్వోటీ పోలీసులు పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఇద్దరికి చికిత్స చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఈ మేరకు డీఎంఎచ్ వో ఉమాగౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.