
ప్రముఖ భారతీయ క్రెడ్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం కునాల్ షాకు కీలక పదవి దక్కింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్కు కొత్త గ్లోబల్ హెడ్గా కునాల్ షా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించింది. 2019 నుంచి వాట్సాప్ను నడిపిస్తున్న విల్ క్యాత్కార్ట్ స్థానంలో కునాల్ షా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్, మెసేజింగ్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా చెల్లింపులు, వ్యాపార సేవలు, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఫీచర్లతో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి వృద్ధి దశకు నాయకత్వం వహించేందుకు కునాల్ షా సరైన వ్యక్తిగా మెటా భావించింది. మెటా ప్రకారం.. కునాల్ షాకు ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారుల అవసరాలపై లోతైన అవగాహన ఉంది. ముఖ్యంగా వాట్సాప్కు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో యాప్ వినియోగం, డిజిటల్ చెల్లింపులు, బిజినెస్ మెసేజింగ్ రంగాలపై ఆయనకు ఉన్న అనుభవం సంస్థకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ నియామకాన్ని ప్రకటిస్తూ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రశంసలు కురిపించారు. ‘‘కునాల్ షా మెటాలో చేరి వాట్సాప్కు తదుపరి నాయకత్వం వహించనున్నారు. క్రెడ్ను భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ను ముందుకు నడిపించడానికి అవసరమైన సృజనాత్మక దృక్పథం, అంతర్జాతీయ అవగాహన ఆయనకు ఉన్నాయి. బిలియన్ల మంది వినియోగదారులు, లక్షలాది వ్యాపారాల కోసం వాట్సాప్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో ఆయనతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ కూడా కునాల్ షా నియామకాన్ని స్వాగతించారు. ‘‘కునాల్ షా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరు. టెక్నాలజీ ఉత్పత్తులు ప్రజల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురాగలవో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. వాట్సాప్ తదుపరి దశ అభివృద్ధికి ఆయన నాయకత్వం ఎంతో కీలకం అవుతుంది.’’ అని తెలిపారు. క్రెడ్ వ్యవస్థాపకుడిగా కునాల్ షా ఇప్పటికే భారత స్టార్టప్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ హెడ్గా బాధ్యతలు స్వీకరించడం భారత టెక్నాలజీ రంగానికి మరో గర్వకారణంగా భావిస్తున్నారు.