Reading Time: 2 minutes
Venezuela Twin Earthquakes Caracas Building Collapse Emergency 2026

Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కరాకస్‌కు పశ్చిమంగా కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడంతో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా, ఆ వెంటనే మరో నిమిషం కూడా గడవకముందే 7.5 తీవ్రతతో రెండో భూకంపం విరుచుకుపడిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ జంట భూకంపాల ధాటికి రాజధాని కరాకస్‌తో పాటు పలు నగరాల్లో భారీ భవనాలు కుప్పకూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో తీవ్ర ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్తు కారణంగా మరణాల సంఖ్య 10 వేల నుంచి ఒక లక్ష వరకు ఉండే ప్రమాదం ఉందని యూఎస్‌జీఎస్ ప్రాథమికంగా అంచనా వేసింది.

ప్రమాద తీవ్రతపై వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా అనేక భవనాలు, నివాస గృహాలు కూలిపోయాయని తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల రక్షణ, పౌర సహాయక బృందాలను రంగంలోకి దించామని ప్రకటించారు. పారిశ్రామిక నగరమైన ‘చాకావో’ మేయర్ గుస్తావో దుక్వె మాట్లాడుతూ.. తమ పరిధిలో రెండు పెద్ద భవనాలు పూర్తిగా కూలిపోయాయని, పలువురు గాయపడటంతో పాటు మరణాలు సైతం సంభవించాయని, అయితే ఖచ్చితమైన మరణాల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రాత్రి వేళ కూడా సహాయక సిబ్బంది టార్చ్ లైట్ల వెలుతురులో శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు.

1821 నాటి చారిత్రాత్మక సైనిక విజయాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినం ప్రకటించారు. అదే క్రమంలో ఈ ఘోరం జరగడంతో జనం ఇళ్లలోనే ఉండిపోయారు. కరాకస్ పశ్చిమ ప్రాంత నివాసి అయిన ఆస్ట్రిడ్ రామిరేజ్ (41) అనే మహిళ మాట్లాడుతూ.. “భూకంపం ప్రారంభం కాగానే చుట్టుపక్కల వారి భీకరమైన అరుపులు వినిపించాయి. ప్రాణాలు రక్షించుకోవడానికి అందరూ మెట్ల గుండా రోడ్లపైకి పరుగులు తీశారు” అని తెలిపారు. కరాకస్ తూర్పు ప్రాంతానికి చెందిన కోరో మార్టినెజ్ (56) అనే మరో నివాసి.. తన జీవితంలో ఇంతటి భయానక శబ్దాన్ని, ప్రకంపనలను ఎప్పుడూ చూడలేదని, ఇళ్లలోని వస్తువులు, ఫ్రిజ్‌లోని పాత్రలు సైతం కిందపడి పగిలిపోయాయని వాపోయారు. అలాగే 80 ఏళ్ల వృద్ధురాలు మరియా రొమేరో మాట్లాడుతూ.. ఈ భూకంపం 1967లో సంభవించిన ఘోర భూకంపం కంటే అత్యంత భయంకరంగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ విపత్తు నేపథ్యంలో తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికాతో ఇటీవలే చమురు, మైనింగ్ రంగాల్లో కుదుర్చుకున్న నూతన సహకార ఒప్పందాల తరుణంలో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించడం దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. కరాకస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ.. తమ పౌరులను సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని కోరింది. నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండటంతో రాత్రి షిఫ్ట్ సిబ్బందిని రెట్టింపు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. కరాకస్ ప్రధాన విమానాశ్రయం పైకప్పు కుప్పకూలడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తీరప్రాంత నగరమైన లా గుఐరాలోనూ భారీగా నష్టం వాటిల్లింది. కాగా, భూకంపం వచ్చిన తొలినాళ్లలో ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్, అరుబా, బొనైర్ వంటి పరిసర దీవులకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను గంట తర్వాత అధికారులు ఉపసంహరించుకోవడంతో ల్యాటిన్ అమెరికా దేశాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి.