
తమిళనాడులో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. ఓ సినిమా నటితో లింక్ పెడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ TVK నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి తాను ఇరుక్కుపోయానన్న భావనలో సీఎం విజయ్ ఉన్నారంటూ అనితా రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. గతంలో ఇంట్లో నటితో కలిసి హాయిగా ఉంటున్న తాను.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా? అని విజయ్ చింతిస్తున్న్లు ఆయన కామెంట్స్ చేశారు. తాను ఓ వ్యాపారినని గుర్తు చేసుకున్న మాజీ మంత్రి.. తన షాప్కు వచ్చేవారి ముఖాలను చూసి వారు ఏదైనా కొనేందుకు వచ్చారో? అప్పు అడిగేందుకు వచ్చారో? తనకు తెలిసిపోతుందన్నారు. అలాగే విజయ్ ముఖాన్ని చూస్తే.. రాజకీయాలకు ఎందుకొచ్చానా? అని విజయ్ మదనపడుతున్నట్లు ఉందని తనకు అర్థమవుతోందన్నారు. ఆత్తూరులో సీఎం విజయ్పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు… మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు.
Anita Radhakrishnan
అక్రమ కేసులతో భయపెట్టలేరు: అనితా రాధాకృష్ణన్
అయితే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా.. నిజాలను నిర్భయంగా చెబుతూనే ఉంటానని.. ప్రజల హక్కుల కోసం పోరాటం ఆపబోమని అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య హక్కులను అక్రమ కేసులతో అణచివేయడం సాధ్యం కాదని అన్నారు.
మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ సీఎం విజయ్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు..దీనికి సంబంధించి ఆయనపై నమోదైన కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీవీకే, డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.