
Rishabh Pant LSG Journey Explained: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రిషభ్ పంత్ ప్రయాణం అధికారికంగా ముగిసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్ను కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ.. అతడిని జట్టు కెప్టెన్గా కూడా నియమించింది. అయితే రెండు సీజన్లలో కెప్టెన్గా పంత్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయాడు. తాజాగా జరిగిన భారీ ట్రేడ్ డీల్లో భాగంగా పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్కు చేరగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన కెప్టెన్సీ ప్రయోగాల్లో ఒకదానికి ముగింపు పలికినట్లైంది.
‘టూ మెనీ మైండ్స్’తో మొదలైన సంకేతాలు:
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే ఎల్ఎస్జీ డ్రెస్సింగ్ రూమ్లో గొడవలు మొదలయ్యాయనే సంకేతాలు వచ్చాయి. జట్టుకు ప్రధాన కోచ్గా జస్టిన్ లాంగర్ ఉండగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా టామ్ మూడీ వ్యవహరించాడు. మరోవైపు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ వంటి అంతర్జాతీయ కెప్టెన్లు కూడా జట్టులో ఉండటం వల్ల నాయకత్వ సూచనలు ఎక్కువయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ ఓటమి అనంతరం పంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ మ్యాచ్లో చివరి ఓవర్ను యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాథీకి అప్పగించిన పంత్ నిర్ణయం విఫలమైంది. రింకూ సింగ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడంతో మ్యాచ్ ఎల్ఎస్జీ చేతుల నుంచి జారిపోయింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘మైదానంలో ఉన్నప్పుడు చాలా మంది సలహాలు ఇవ్వడం మంచిది కాదు అంటూ ‘టూ మెనీ మైండ్స్’ వ్యాఖ్యలు చేశాడు. ఇది జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్తో విభేదాలపై ఊహాగానాలకు తెరలేపింది.
సీజన్ మొత్తం నిరాశ.. పెరిగిన అసహనం:
ఐపీఎల్ 2025లో పంత్ బ్యాటింగ్ నిరాశపరిచింది. ఆ సీజన్లో అతడు కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2026లో 312 పరుగులకే పరిమితమయ్యాడు. ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా, ఫినిషర్గా ఆడినా.. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. జట్టు వరుస ఓటములతో పంత్పై ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ల అనంతరం మీడియా సమావేశాల్లో కూడా అతడు అసహనంగా కనిపించేవాడు. ఒక దశలో జట్టును ఉద్దేశించి ‘ఎఫ్ వర్డ్’ ఉపయోగిస్తూ ‘మేము మంచి జట్టే’ అని వ్యాఖ్యానించడం కూడా వార్తల్లో నిలిచింది. ఇది అతడి నిరాశ ఎంత స్థాయికి చేరుకుందో చూపించింది.
కెప్టెన్సీపై అసంతృప్తి.. ‘లీడర్షిప్ రీసెట్’ వ్యాఖ్యలు:
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే ఎల్ఎస్జీ డైరెక్టర్ టామ్ మూడీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. జట్టు భవిష్యత్ నాయకత్వంపై సమగ్ర సమీక్ష అవసరమని, ‘లీడర్షిప్ రీసెట్’ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మూడీ స్పష్టం చేశాడు. ‘ఫ్రాంచైజీ నాయకత్వం భవిష్యత్తులో ఎలా ఉండాలనే అంశంపై చాలా సీరియస్గా ఆలోచిస్తాం’ అని సీజన్ ముగింపు సమయంలో మూడీ పేర్కొన్నాడు. అనంతరం పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా లీడర్షిప్ రీసెట్ అవసరమని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ వ్యాఖ్యలు జట్టు యాజమాన్యం పంత్ నాయకత్వంతో పూర్తిగా సంతృప్తిగా లేదనే సంకేతాలను ఇచ్చాయి.
తిరిగి ఢిల్లీ గూటికి చేరిన పంత్:
చివరికి పంత్ స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరడంతో ఎల్ఎస్జీ అతడిని విడుదల చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన భారీ ట్రేడ్లో భాగంగా పంత్ తన పాత జట్టుకు తిరిగి చేరాడు. దాదాపు దశాబ్ద కాలం ఢిల్లీకి ముఖచిత్రంగా నిలిచిన పంత్.. ఇప్పుడు మళ్లీ అదే జెర్సీలో కనిపించనున్నాడు. ఎల్ఎస్జీలో రూ.27 కోట్ల ఒప్పందంతో మొదలైన ప్రయాణం.. ‘టూ మెనీ మైండ్స్’, కెప్టెన్సీపై విమర్శలు, యాజమాన్య అసంతృప్తి, చివరికి ‘లీడర్షిప్ రీసెట్’ వరకు సాగి ముగిసింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో కొత్త ఆరంభంతో పంత్ తన కెరీర్ను మళ్లీ గాడిలో పెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.