Reading Time: 2 minutes
Pakistan Indus Valley Civilization Claim India Water Dispute

Pakistan: భారత్ – పాకిస్థాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సింధు జలాల వివాదం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం చట్టపరమైన, సాంకేతిక పరిధిలోనే సాగిన ఈ నీటి యుద్ధంలోకి పాకిస్థాన్ ఇప్పుడు ‘నాగరికత, సంస్కృతి’ అనే సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగానే, కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన తన ఇస్లాం-పూర్వ చరిత్రను, ముఖ్యంగా సింధు లోయ నాగరికతను పాక్ అకస్మాత్తుగా ఓన్ చేసుకోవడం ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపులపై ‘ఆపరేషన్ సిందూర్’ను స్టార్ట్ చేసి, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ నీటి సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడటానికి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో ఒక సరికొత్త వాదనను ముందుకు తెచ్చారు. భారత్ ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన నేరుగా సింధు నాగరికతకు ముడిపెట్టారు.

మోహెంజొదారో, హరప్పా మాదే..

పాకిస్థాన్ విద్యార్థులకు తమ దేశ చరిత్ర క్రీ.శ.712లో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌ను ఆక్రమించడంతోనే ప్రారంభమైందని దశాబ్దాలుగా బోధిస్తున్నారు. కానీ నీటి వివాదం ముదరడంతో పాక్ పాలకులకు అకస్మాత్తుగా 5000 ఏళ్ల నాటి ప్రాచీన నాగరికత గుర్తుకొచ్చింది. 1965లో అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త జార్జ్ డేల్స్ తర్వాత ఎవరూ తాకని మోహెంజొదారో సైట్‌లో పాకిస్థాన్ జూన్ 2025లో తిరిగి తవ్వకాలు ప్రారంభించింది. “మోహెంజొదారో, హరప్పా మా భూభాగంలోనే ఉన్నాయి, కాబట్టి సింధు నదికి అసలైన, ఏకైక వారసులం మేమే” అని బిలావల్ భుట్టో, ప్రెసిడెంట్ జర్దారీ అంతర్జాతీయ వేదికలపై వాదిస్తున్నారు. భారత్ తీసుకున్న చర్యను నేరుగా “సింధు నాగరికతపై జరిగిన దాడిగా” వారు అభివర్ణిస్తున్నారు.

ఇస్లామిక్ ఐడెంటిటీ నుంచి యూ-టర్న్!

నిన్నటివరకు ఇస్లామిక్ చరిత్రను మాత్రమే నెత్తిన పెట్టుకున్న పాకిస్థాన్, ఇప్పుడు ఉనికి కోసం ఇస్లాం-పూర్వ కాలానికి చెందిన తక్షశిల, గాంధార, బలూచిస్థాన్‌లోని మెహర్‌గఢ్ వంటి పురాతన బౌద్ధ, వైదిక, గ్రీకో-బౌద్ధ సంస్కృతులను ప్రమోట్ చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో డాక్యుమెంటరీలు, సెమినార్లు, తక్షశిల అంతర్జాతీయ టూరిజం క్యాంపెయిన్ల ద్వారా “తామే అసలైన ప్రాచీన భారతదేశం” (True India) అని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ తిమోతీ కేన్ తక్షశిలను సందర్శించి ప్రశంసించగా, దానికి పాక్ విశ్లేషకులు స్పందిస్తూ.. “ఈ నది, దీని చరిత్ర పాకిస్థాన్‌దే. ఈ నది లేని వారు దీనిపై హక్కులు కోరలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఈ నది పాకిస్థాన్‌ను ఏకం చేసే శక్తని, ఈజిప్టుకు నైలు నది ఎలాంటిదో పాక్‌కు సింధు నది అలాంటిదని వారు పోల్చుతున్నారు.

అసలు వాస్తవాలు ఏంటంటే..

చట్టపరమైన – చారిత్రక కోణంలో చూస్తే పాకిస్థాన్ చేస్తున్న ఈ ఎమోషనల్ అస్త్రంలో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. సింధు నాగరికతకు చెందిన కొన్ని ప్రధాన సైట్లు పాక్‌లో ఉన్నప్పటికీ, హరప్పా సంస్కృతికి చెందిన అత్యధిక శాతం ప్రాంతాలు (ముఖ్యంగా ఎండిపోయిన ఘగ్గర్-హాక్రా/సరస్వతి నది తీర ప్రాంతాలు) ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నీటి పంపకాలు అనేవి మారుతున్న వాతావరణ పరిస్థితులు, జనాభా అవసరాలు, శాస్త్రీయ అంచనాలపై ఆధారపడి ఉంటాయి. ప్రాచీన చరిత్ర లేదా పురావస్తు ఆధారాలు ఆధునిక నీటి హక్కులను నిర్ణయించలేవు. 60 ఏళ్ల క్రితం నాటి సింధు జలాల ఒప్పందం ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని, దీనిని సవరించాలని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. పురాతన మోహెంజొదారో పేరు చెప్పి అంతర్జాతీయంగా కొంత సానుభూతి పొందాలని పాకిస్థాన్ చూస్తున్నప్పటికీ, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా చర్చలకు రాకుండా కేవలం ‘చరిత్ర’ను అడ్డం పెట్టుకుని నీటిని సాధించలేరనేది నిపుణులు చెబుతున్న మాట.