
Pune Ketan Agarwal Murder Case: ఇండోర్ ‘సోనమ్ రఘువంశీ’ కేసు సృష్టించిన సంచలనం ఇంకా ప్రజల మనసుల నుంచి చెరిగిపోకముందే, మహారాష్ట్రలోని పుణెలో జరిగిన మరో దారుణ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది. ప్రేమ, పెళ్లి అనే పవిత్ర బంధాల వెనుక దాగున్న నమ్మకద్రోహాన్ని ఈ రెండు ఘటనలు కళ్లకు కడుతున్నాయి. ఒకరిదేమో పెళ్లయిన జీవితం, మరొకరిదేమో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జీవితం. ఒకరిని భార్య పర్వతాల పైకి తీసుకెళ్తే, మరొకరిని కాబోయే భార్య కోట ట్రెకింగ్కు తీసుకెళ్లింది. వెళ్లిన చోట ఇద్దరి జీవితాల్లోకి ప్రియుడు ప్రవేశించాడు. చివరికి ఆ ఇద్దరి కథలూ మరణంతోనే ముగిశాయి. దీంతో ఇప్పుడు యూత్లో కొత్త టెన్షన్ మొదలైంది. పెళ్లి, ప్రేమపై నమ్మకం తగ్గుతోంది. అస్సలు పెళ్లి వద్దు బాబోయ్ అనే స్టేజ్కి వెళ్తున్నారు. అసలు పుణెలో ఏం జరిగిందో తెలుసుకుందాం..
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి మరణించాడు. మొదట అందరూ ప్రమాదంగానే భావించారు. లోహాఘడ్ కోటపై ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తూ 350-400 అడుగుల లోతైన లోయలో పడిపోయాడని అతని కాబోయే భార్య సియా గోయల్ పోలీసులకు చెప్పింది. పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయడంతో అసలు నిజం బయటపడింది. ఏ అమ్మాయితో అయితే కేతన్ ఏడడుగులు నడవాల్సి ఉందో, ఆ అమ్మాయే తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి అతడిని లోయలోకి తోసేసిందని పోలీసులు నిర్ధారించారు. పుణె పోలీసులు సియా, ఆమె ప్రియుడు చేతన్లను అరెస్ట్ చేయగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ‘సోనమ్ రఘువంశీ’ పేరు మళ్లీ మారుమోగింది. ఈ రెండు కేసుల్లోనూ బయటకు కనిపించే బంధం చాలా సాధారణంగా, సంతోషంగా ఉంది. ఇరు కుటుంబాలు ఎన్నో కలలు కన్నాయి. కానీ, లోపల మాత్రం హత్యకు పక్కా స్కెచ్ నడిచింది. అయితే రాజా హత్య తర్వాత సోనమ్ కనిపించకుండా పోయి యూపీలోని గాజీపూర్లో దొరకగా, సియా మాత్రం ఎక్కడికీ పారిపోకుండా ఇక్కడే ఉండిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సియా, కేతన్లు కలిసి డాన్స్ చేసిన వీడియోలు, కుటుంబంతో నవ్వుతూ గడిపిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం సోనమ్, రాజా రఘువంశీ వీడియోలు కూడా ఇలాగే హల్చల్ చేశాయి. ఈ వీడియోలు చూసిన వారెవ్వరూ వీరి జీవితాలు ఇంత దారుణమైన మలుపు తిరుగుతాయని ఊహించలేరు. అందుకే, ‘బయటకు కనిపించేదంతా నిజం కాదు’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ చేసిన ఆరోపణ. ప్రమాదం జరిగిన జూన్ 18 కంటే నాలుగు రోజుల ముందు, అంటే జూన్ 14న కూడా సియా కేతన్ను అదే లోయ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ కేతన్ కింద పడబోతుండగా తానే కాపాడానని, అక్కడ పాము కనిపించడంతో భయపడి నెట్టేసానని అప్పట్లో సియా నమ్మబలికింది. కానీ కొడుకు మరణం తర్వాత, అది తృటిలో తప్పిన మొదటి హత్యాయత్నంగా తండ్రి భావిస్తున్నాడు. కేతన్ మరణం తర్వాత సియా సోషల్ మీడియాలో ‘నా హృదయానికి తెలుసు, నువ్వు ఇక్కడే ఉన్నావు…’ అంటూ పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది నిజమైన బాధతో పెట్టిందా లేక నాటకమా అనేది తేలాల్సి ఉంది. ఇక, వీరి వివాహం కోసం రాజస్థాన్లో రూ. 17 కోట్లతో ఒక విలాసవంతమైన ప్యాలెస్ను బుక్ చేశారు. అతిథుల కోసం రెండు ప్రైవేట్ జెట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. నవంబర్లో జరగాల్సిన ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరిగింది. పెళ్లి పత్రికలు అచ్చవ్వాల్సిన చోట మరణవార్త చూడాల్సి వచ్చింది. ఈ రెండు కేసుల తర్వాత సమాజం ముందు ఒకే ప్రశ్న నిలుస్తోంది. ఒక బంధంలో కలిసి జీవించడం ఇష్టం లేనప్పుడు, మనసు మారినప్పుడు లేదా వేరొకరు నచ్చినప్పుడు విడిపోవచ్చు కదా, దానికి హత్యే ఏకైక మార్గమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వరుస కేసులు చూసిన తరువాత అబ్బాయిలు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది!