Reading Time: < 1 minute
Tamil Nadu Moves Supreme Court Against High Court Order In Thirupparankundram Deepam Case

Deepam Row: తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సంప్రదాయ దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ముందు మతపరమైన వివాదానికి కారణమైన ఈ దీపం సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ జూన్ 11న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మదురై బెంచ్ జనవరి 6న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 2025 డిసెంబర్ 1న సింగిల్ జడ్జి కార్తీక దీపోత్సవం రోజున తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దేవాలయం వద్ద ఉన్న స్తంభంపై దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు సమస్య వాటిల్లుతుందని అప్పటి డీఎంకే సర్కార్ చెప్పడాన్ని కోర్టు వ్యతిరేకించింది.

వివాదం ఏమిటి?

సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్న కొండపైనే హజరత్ సుల్తాన్ సికిందన్ బదుషా అవులియా దర్గా ఉంది. దీని వల్ల ఆలయం వద్ద దీపం వెలిగిస్తే మత పరమైన ఇబ్బందులు ఏర్పడి, రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతింటుందని అప్పటి డీఎంకే ప్రభుత్వం, ఆలయ యాజమాన్యం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేశాయి. దీని తర్వాత దీప స్తంభం ఉన్న ప్రాంతం సుబ్రహణ్య స్వామి ఆలయానిదే అని, ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు తీర్పుపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. నిజానికి కొండపై ఉన్న ఆలయం 6వ శతాబ్ధానికి చెందినది కాగా, దర్గా 14వ శతాబ్ధానికి చెందినది.