Reading Time: 2 minutes
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. వచ్చే నెలలోనే ప్రారంభం.. ఎక్కడంటే..?

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. వచ్చే నెలలో కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఏపీలో ఇప్పటికే చాలా ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మరొకటి చేరనుంది. అదే భోగాపురం ఎయిర్‌పోర్ట్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెల 8వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచే సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీపీపీ మోడల్‌లో జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టింది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు వెళ్లగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఇక సరుకు రవాణాకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ కీలకం కానుంది.

జనవరిలో పూర్తయిన ట్రయల్ రన్

ఈ ఏడాది జనవరిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రయల్ రన్ పూర్తయింది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఫ్లైట్ సురక్షితంగా భోగాపురంలో ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ సక్సెస్ అవ్వడంతో ప్రారంభానికి రెడీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవ్వడంతో సర్వీసులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా యూజర్ డెవలప్‌మెంట్ ఛార్జీలను కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ ఎకనామిక్ రెగ్యూలేటరీ అధారిటీ ఛార్జీలను ఫిక్స్ చేసింది. ప్రయాణికుల టికెట్‌పై ఈ ఛార్జీలను విధిస్తారు. ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లే డొమెస్టిక్ ప్రయాణికులకు రూ.835, వచ్చే ప్రయాణికులకు రూ.355గా నిర్ణయించారు. ఇక ఇంటర్నేషనల్ ప్రయాణాలకు ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లేవారికి రూ.1255, వచ్చేవారికి రూ.545గా ఫిక్స్ చేశారు. ఇక ఎయిర్‌పోర్టుును ఉపయోగించుకున్నందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలకు విధించే ఛార్జీలను కూడా నిర్ణయించారు.

ల్యాండింగ్ ఫీజులు ఎంతంటే..

డొమెస్టిక్ విమానాలకు సంబంధించి గరిష్ట టేకాఫ్ బరువులో ప్రతి మెట్రిక్ టన్నుకు రూ.1400 ల్యాండింగ్ ఫీజు ఫిక్స్ చశారు. ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు రూ.1975గా నిర్ణయించారు. ఇక ఎయిర్‌లైన్స్ సంస్థలను ప్రోత్సహించేందుకు ల్యాండింగ్ ఛార్జిల పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఉన్న రూట్లలో సేవలు అందించే సంస్థలు ల్యాండింగ్ ఛార్జీలో 80 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొత్త మార్గాల్లో సర్వీసులను నడిపే సంస్థలు 60 శాతం చెల్లించాలి. ఇక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ల్యాండ్ అయ్యే డొమెస్టిక్ ఫ్లైట్ల నుంచి 25 శాతం ల్యాండింగ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఇక విమానాల పార్కింగ్ విషయానికొస్తే.. రెండు గంటల పాటు ఉచిత సదుపాయం కల్పిస్తారు. ఆ తర్వాత ప్రతి మెట్రిక్ టన్నుకు గంటకు రూ.19 ఉంటుంది.