Reading Time: 2 minutes
Jai Shri Ram Chants Why Are Hindus Protesting In Bangladesh Explained

Explainer: ఒకప్పుడు భాష కోసం పాకిస్థాన్‌తో కోట్లాడి దేశాన్ని సాధించిన బంగ్లాదేశ్… ఇప్పుడు మతపరమైన ఉద్రిక్తతలతో అల్లాడుతోంది. ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువులు చేతుల్లో జ్యోతులు పట్టుకుని జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ ఐదేళ్ల క్రితం ప్రశాంతంగా కనిపించే నగరంలోని ప్రధాన సెంటర్లుఆ తర్వాత నిరసనల కేంద్రాలుగా మారిపోతూ వచ్చాయి. ఇంతకీ బంగ్లాదేశ్‌లోని హిందువులు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు? ఒక రాముడి ఫొటోని అవమానించారన్న కథ ఎలా దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసింది? ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక భారీ రామ విగ్రహం ఎందుకు వివాదానికి కేంద్రబిందువైంది?

రాముడి విగ్రహంపై రచ్చ ఎలా మొదలైంది?

ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయ, సామాజికవర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైన అంశం ఉత్తర బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న భారీ శ్రీరామ విగ్రహం. దాదాపు 81 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ విగ్రహం పూర్తయితే దేశంలోనే అత్యంత ఎత్తైన రామ విగ్రహంగా నిలవాల్సి ఉంది. అంతేకాదు రాముడితో పాటు కృష్ణుడు, శివుడి విగ్రహాలు కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే సుమారు 80శాతం పనులు పూర్తయ్యాయి. అయితే కొందరు ఇస్లామిస్ట్ వర్గాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం ప్రారంభించాయి. బెదిరింపులు పెరగడంతో ఆలయ కమిటీ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది.

అక్కడితో వివాదం ఆగలేదు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రాముడి చిత్రంపై చెప్పు ఉంచి అవమానించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఫిర్యాదులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అదే కారణంగా ఢాకాలోని షాహ్ బాగ్ కూడలిలో భారీ ర్యాలీలు జరిగాయి. వేలాది మంది హిందువులు వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి గడువు కూడా విధించారు.

బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా ఎందుకు తగ్గింది?

ఈ ఘటనను అర్థం చేసుకోవాలంటే బంగ్లాదేశ్ చరిత్రను కొద్దిగా వెనక్కి వెళ్లి చూడాలి. 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు లౌకికవాదం దేశానికి ప్రధాన సూత్రంగా ఉండేది. అయితే తర్వాతి దశాబ్దాల్లో రాజకీయ పరిణామాలు, మతపరమైన ప్రభావాలు దేశ సామాజిక నిర్మాణాన్ని క్రమంగా మార్చాయి.

ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు సుమారు 8శాతం మాత్రమే ఉన్నారు. 1971 స్వాతంత్ర్యం సమయంలో ఈ సంఖ్య 14శాతంగా ఉండేది. కానీ వలసలు, సామాజిక ఒత్తిళ్లు, భద్రతా ఆందోళనల కారణంగా వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు, పూజా కార్యక్రమాల సమయంలో ఉద్రిక్తతలు, ఆస్తులపై దాడులు లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అస్థిరత పెరిగిన సందర్భాల్లో మైనారిటీల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2026 తొలి మూడు నెలల్లోనే 100కు పైగా మతపరమైన హింసా ఘటనలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ నిరసనలు కేవలం ఒక దేవుడి ఫొటోను అవమానించారనే అంశం చుట్టూ మాత్రమే తిరగడం లేదు. తమ మత స్వేచ్ఛ, తమ గుర్తింపు, తమ భద్రతకు సంబంధించిన పెద్ద ప్రశ్నలను కూడా హిందూ సంఘాలు లేవనెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతి పౌరుడికీ తమ మతాన్ని ఆచరించే హక్కు ఉందని చెబుతోంది. బంగ్లాదేశ్ అందరిదీ అనే సందేశాన్ని నాయకత్వం పలుమార్లు కుండబద్దలు కొట్టింది. అయినప్పటికీ రియాల్టీలో పరిస్థితులు అలా కనిపించడం లేదు. ఒకవైపు సామాజిక సామరస్యాన్ని కాపాడాలనే పేరుతో విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వస్తే, మరోవైపు తమ మతపరమైన హక్కులు దెబ్బతింటున్నాయనే భావన మైనారిటీల్లో పెరుగుతోంది.

ఇక నిలిచిపోయిన రామ విగ్రహ నిర్మాణం మళ్లీ ప్రారంభమవుతుందా అనే అంశాలపై అందరి దృష్టి నిలిచింది. ప్రస్తుతం ఢాకా వీధుల్లో వినిపిస్తున్న నినాదాలు కేవలం ఒక రాముడి విగ్రహం కోసం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ, సామాజిక సమానత్వంపై జరుగుతున్న పెద్ద చర్చకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.