
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీకి సంబంధించిన ఫోటోలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. కానీ ఈ భేటీకి సంబంధించిన అజెండాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల వేళ రాష్ట్రపతి ముర్ముతో మోడీ భేటీ కావడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించేందుకు ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
►ALSO READ | కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా : రాష్ట్రపతి ఆమోదం
ప్రధాని మోడీ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీ పాలిటిక్స్లో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత కేబినెట్లోని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్తవారికి అవకాశం కల్పించున్నట్లు సమాచారం. కొందరు యువ నేతలు, మహిళలలు, ఎన్డీఏ మిత్రపక్షాల ప్రతినిధులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం కానీ, పీవోం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.