
Padma Awards: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాల ప్రదానోత్సవంతో అత్యంత వైభవంగా మెరిసిపోయింది. వివిధ రంగాల్లో దేశానికి అసమాన సేవలు అందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మ అవార్డులతో సత్కరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
మమ్ముట్టి, విజయ్ అమృత్ రాజ్లకు పద్మభూషణ్..
భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గానూ మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృత్ రాజ్ను కూడా ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. వైద్యరంగంలో చేసిన విశేష సేవలకు గానూ ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు.
శిబు సోరెన్కు మరణానంతర పురస్కారం
జేఎమ్ఎమ్ (JMM) వ్యవస్థాపకుడు, ప్రముఖ గిరిజన నాయకుడు శిబు సోరెన్కు ప్రజాసేవ విభాగంలో మరణానంతరం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన తరఫున సతీమణి రూపి సోరెన్ ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళిలకు పద్మశ్రీ
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్లను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో వారు ఈ అవార్డులను అందుకున్నారు.
విజ్ఞాన, సాంకేతిక (Science & Technology) రంగాల్లో చేసిన అద్భుత సేవలకు గుర్తింపుగా తెలంగాణకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త చంద్రమౌళికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాల విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో ఈ వేడుక కంటిపండుగలా సాగింది.