
Diabetes Diet: మధుమేహం ఉన్నవారిలో తరచుగా వినిపించే ప్రశ్న రోటీ తినాలా, అన్నం తినాలా అనేదే. ఈ అంశంపై ప్రముఖ మధుమేహ నిపుణులు కీలక సూచనలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో రోటీ సాధారణంగా అన్నం కంటే మెరుగైన ఎంపికగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. వైద్యుల ప్రకారం రోటీ ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కావడంతో అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి క్రమంగా విడుదలై చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా గోధుమతో పాటు శనగపిండి, సజ్జలు, జొన్నలతో తయారైన మల్టీగ్రెయిన్ రోటీలు మరింత ప్రయోజనకరమని సూచించారు.
అయితే మధుమేహ రోగులు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.. తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా పార్బాయిల్డ్ రైస్ను ఎంచుకోవాలని, అలాగే అన్నాన్ని ఒంటరిగా కాకుండా పప్పులు, శనగలు వంటి ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకోవాలని సూచించారు. భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సలాడ్ తీసుకోవడం, అనంతరం ప్రోటీన్ ఆహారం తీసుకుని తర్వాత అన్నం లేదా రోటీ తినడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. సరైన ఆహార ఎంపికలు, భోజన పద్ధతులు పాటించడం ద్వారా మధుమేహ నియంత్రణ మరింత సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.