నిన్నటి వరకు నిప్పుల కుంపటిలా మండిపోయిన ఎండలతో అల్లాడిన ప్రజలకు వరుణ దేవుడు చల్లని కబురు అందించాడు. జూన్ 22 (సోమవారం) నుంచి నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని, వ్యవసాయ పనుల ఆరంభాన్ని సూచించే పవిత్రమైన ‘ఆరుద్ర కార్తె’ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన తొలకరి జల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అటు ప్రకృతి పరంగా ఇటు ఆధ్యాత్మికంగా ఈ కార్తెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ వివరాలు చూద్దాం..
శివుని రుద్ర స్వరూపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రానికి అధిపతి పరమశివుని ఉగ్రరూపమైన ‘రుద్రుడు’. సృష్టిలో వినాశనానికి ఆ తర్వాత జరిగే పునరుత్పత్తికి ప్రతీకగా శివుడిని భావిస్తారు. అలాగే ఆరుద్ర నక్షత్రాన్ని భోళాశంకరుని జన్మ నక్షత్రంగా కూడా పెద్దలు చెబుతారు. ఇక అందుకే ఆరుద్ర నక్షత్రంతో కూడిన ఈ కార్తె కాలం శివారాధనకు అత్యంత విశిష్టమైనదిగా మారింది.

అభిషేకాలు, మంత్ర జపాలు: ఆరుద్ర కార్తె రోజుల్లో శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం లేదా నేతితో అభిషేకం చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఇక ఈ పవిత్రమైన రోజుల్లో ‘ఓం నమః శివాయ’ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని లేదా ‘మృత్యుంజయ మంత్రం’ జపించడం ద్వారా సర్వవ్యాధులు తొలగిపోయి, భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
పులకరిస్తున్న నేలతల్లి: ఆరుద్ర కార్తె ప్రవేశంతో గ్రామాల్లో వ్యవసాయ పనుల సందడి మొదలైంది. ఈ కార్తెలో వర్షాలు కురవడమే ఆలస్యం.. నేల తల్లి పులకరించిపోతుంది. ఇక ముదురు ఎరుపు రంగులో మెరిసిపోయే అందమైన ‘ఆరుద్ర పురుగులు’ భూమిలోంచి బయటకు వస్తూ గ్రామాల్లో అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. ఇవి ఈ కార్తెకు ఒక ప్రకృతి సిద్ధమైన గుర్తింపుగా నిలుస్తాయి.
ఇక ఆరుద్ర కార్తె అనేది అటు రైతులకు సాగు సమయాన్ని, ఇటు భక్తులకు ఆధ్యాత్మిక సిద్ధిని ఇచ్చే ఒక అద్భుతమైన కాలం. నిష్కల్మషమైన మనసుతో ఈ కార్తెలో పరమేశ్వరుడిని పూజిస్తే మనశ్శాంతి లభించడమే కాకుండా సకల పాపాలు హరిస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే ఈ పుణ్యకాలంలో శివనామ స్మరణ చేస్తూ ఆ దేవదేవుని కృపకు పాత్రులవుదాం.
ఆరుద్ర కార్తెలో కురిసే వర్షాలు వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సమయంలో భూమిని సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.
The post ఆరుద్ర కార్తె విశేషాలు.. శివారాధనకు ఎందుకు ప్రత్యేక కాలం? appeared first on Manalokam – Latest Telugu News & Updates.