
Ranabali : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో, మూడోసారి వీరిద్దరూ జతకట్టిన ‘రణబలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనౌన్స్ అయినప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీపై కొత్త చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ‘రణబలి’ అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 11 విడుదలను వాయిదా వేసి అక్టోబర్లో కొత్త తేదీని ఖరారు చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు కూడా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల విషయంలో విడుదల తేదీల్లో మార్పులు జరగడం కొత్త విషయం కాదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు చివరి నిమిషంలోనూ నిర్ణయాలు మార్చడం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో ‘రణబలి’ విషయంలో కూడా జరగుతున్నట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ‘రణబలి’ నిలవనుండగా, రష్మిక మందన్నతో ఆయన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదల తేదీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ‘రణబలి’ రిలీజ్ డేట్పై నెలకొన్న ఉత్కంఠ మాత్రం కొనసాగనుంది.