
Telangana Weather: మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. బ్రేక్ పడిన నైరుతి రుతుపవనాల గమనంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రానున్న 24 గంటల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాస్తవానికి జూన్ 8వ తేదీనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదు. అయితే ప్రస్తుతం తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి ఏర్పడటంతో రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి.
ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడవచ్చు. బుధవారం నాటికి వానలు మరింత విస్తరించి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో దంచికొట్టనున్నాయి. ఇక గురువారం నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగి, పైన పేర్కొన్న జిల్లాలతో పాటు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన వర్షం, మంగళవారం ఉదయం వరకు జల్లులుగా కురుస్తూనే ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. రానున్న 24 గంటల్లో కూడా నగరంపై మేఘాలు కమ్ముకుని ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు 50 శాతానికి పైగా అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే వర్షం పడేటప్పుడు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద గానీ, పాత భవనాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. గడిచిన ఒక రోజులో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో అత్యధికంగా 7.9 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 5.1 సెం.మీ, మంచిర్యాల జిల్లా తాండూర్లో 3.8 సెం.మీ చొప్పున వాన పడింది. అయితే ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఇంకా వడగాలుల తీవ్రత కొనసాగుతోంది.