Reading Time: 2 minutes
Ravichandran Ashwin Defends Vaibhav Sooryavanshi After On Field Controversy

Ravichandran Ashwin: టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన ముక్కోణపు ‘ఎ’ సిరీస్‌లో అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు వివాదంతోనూ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన ఈ కుర్రాడు.. లీగ్ దశలో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడితో తీవ్రమైన వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవలో మైదానంలోనే అవతలి ప్లేయర్‌ను నెట్టేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వయసులోనే ఇంత దురుసు ప్రవర్తన ఏంటంటూ నెటిజన్లు ఆ యువ క్రికెటర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ వైభవ్‌కు పూర్తి మద్దతుగా నిలిచాడు.

తన హిందీ యూట్యూబ్ ఛానెల్ ‘యాష్ కి బాత్’ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. “అసలు వైభవ్ సూర్యవంశీని మీరు ఎలా ద్వేషిస్తారు?” అని ప్రశ్నించాడు. “వేరే ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ పిల్లాడు మెచ్యూరిటీ ప్రదర్శించాలంటూ చాలామంది అనడం నేను విన్నాను. ఒకప్పుడు మనం కూడా పిల్లలమే అన్న విషయం మర్చిపోయామా? మన కుటుంబాల్లో కూడా పిల్లలు ఉంటారనే సంగతి గుర్తులేదా?” అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చిన్న వయసులోనే ఆడినప్పటికీ సచిన్ టెండూల్కర్ చూపించిన శాంతాన్ని, సంస్కారాన్ని వైభవ్ నుంచి కూడా జనం ఆశిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు అశ్విన్ గట్టిగానే సమాధానమిచ్చాడు. సచిన్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు వైభవ్‌పై మీడియా, ప్రజల నిఘా చాలా ఎక్కువగా ఉందని గుర్తుచేశాడు. “సచిన్ టెండూల్కర్ కాలంలో ‘ఇండియా ఎ’ మ్యాచ్‌లను కెమెరాలతో ఇంత నిశితంగా ఎవరు ఫాలో అయ్యారు? అప్పట్లో ఐపీఎల్ ఉందా? అప్పటి శ్రీలంక ఆటగాళ్లకు సచిన్ గురించి అంతగా తెలిసే అవకాశం ఉండేదా? కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. ఇది ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ సాగుతున్న సరికొత్త కాలం” అని అశ్విన్ విశ్లేషించాడు.

మైదానంలో జరిగే ఇలాంటి గొడవలను జడ్జ్ చేయడానికి మ్యాచ్ రెఫరీలు, అంపైర్లు ఉన్నారని, ఎక్కడో దూరం నుంచి కూర్చుని మాట్లాడకూడదని అశ్విన్ హితవు పలికాడు. “నేను ఇక్కడ భారత లేదా శ్రీలంక ఆటగాళ్ల గురించి మాట్లాడటం లేదు. క్రీడల్లో ఇలాంటి సంఘటనలు సహజమని మనం అర్థం చేసుకోవాలి. ప్రవర్తన హద్దులు దాటితే చూసుకోవడానికి అంపైర్లు ఉన్నారు. అది తప్పా ఒప్పా అని మనం ఒక అభిప్రాయానికి రావచ్చు, కానీ ఇక్కడ పరిస్థితి ద్వేషించే స్థాయికి వెళ్తోంది. అక్కడ ఏం మాట్లాడారో, ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడో దూరం నుంచి చూసే మనకు తెలియదు. పిల్లాడు గౌరవంగా ఉండాల్సింది అని చెబుతున్నారు కానీ.. భావోద్వేగాలను, శరీరాన్ని పణంగా పెట్టి ఆడే ఆటలో ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగని అతన్ని ద్వేషించడం చాలా ప్రమాదకరమైన ట్రెండ్” అని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశాడు.