
తాజాగా జరిగిన ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంటూనే, తన కుమారుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పడ్డ కష్టంపై ఎంతో ఆవేదనతో, గర్వంగా మాట్లాడారు. మెగాస్టార్ చేసిన ఈ ఎమోషనల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఒక ధ్యేయం ఉండాలని, దాన్ని సొంతం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “ఈ రోజున ఒక స్టార్ కొడుకుగా, గోల్డెన్ స్పూన్తో పుట్టిన చరణ్కు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ ఏం చెప్తే అది మెకానికల్గా చేసి వెళ్లిపోయినా ఈ సినిమా హిట్ అయ్యేదేమో! కానీ చరణ్ అలా చేయలేదు. తన కష్టాన్ని నమ్ముకుని 100% కి మించి శ్రమించాడు. అందుకే ఈ రోజు అందరూ దీన్ని చరణ్ ‘వన్ మ్యాన్ షో’ అంటున్నారు. జీవితంలో ఏదీ ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్కట్.. అడ్డదారుల్లో ఏదీ దక్కదు. నా బిడ్డ పడ్డ కష్టానికి ప్రతీకగా ఈ రోజు ప్రేక్షకులు అతన్ని రామ్ చరణ్ అని కాకుండా ‘పెద్దియే’ అని పిలుస్తున్నారు. ఒక తండ్రిగా ఆ బిడ్డకు మీరిచ్చే ఈ ఆశీస్సులు చాలు” అని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చరణ్కు ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని అంటుండటంపై మెగాస్టార్ స్పందించారు. “గతంలో ‘రంగస్థలం’ సినిమా అప్పుడు కూడా దర్శకుడు సుకుమార్ నాతో ఎన్నోసార్లు అన్నాడు.. ‘సార్, ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్’ అని. అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి.. రావచ్చు, రాకపోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ అవార్డుల కంటే ప్రజల మనసుల్లో ఎంత అద్భుతమైన నటన ఇచ్చాడు అని గుర్తింపు తెచ్చుకోవడమే అసలైన గెలుపు. దానికంటే మించిన అవార్డు ఇంకోటి ఉండదు. చరణ్ను అంతలా మెచ్చుకుంటున్నందుకు మీ అందరికీ థాంక్స్” అని చిరనవ్వుతో చెప్పారు.
మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కష్టపడటాన్ని మాత్రమే నమ్ముకుంటుందని, ఒళ్ళు వంచి పని చేయడమే తమకు తెలుసని చిరంజీవి స్పష్టం చేశారు. “ఈ రోజుకీ చాలా మంది నన్ను అడుగుతుంటారు.. ‘చిరంజీవి గారు, మీరేంటి ఈ వయసులో కూడా రెండు పూటలా ఎక్సర్సైజ్ చేస్తారు?’ అని. అవకాశం ఉంటే రెండు పూటలా చేస్తాను, లేదంటే ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా జిమ్ చేస్తాను. నేను, చరణ్ ఇద్దరం జిమ్లో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటాం” అంటూ తమ పర్సనల్ ఫిట్నెస్ సీక్రెట్ను సరదాగా పంచుకున్నారు.