Reading Time: < 1 minute
Mahesh Babu As Chief Guest For Srinivasa Mangapuram Pre Release Event On July 2

ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “శ్రీనివాస మంగాపురం”. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జులై 2న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరుకాబోతున్నారు. తన సొంత అన్న కొడుకు జయకృష్ణను టాలీవుడ్‌కు పరిచయం చేసే ఈ వేడుకకు మహేశ్ బాబు రానుండటంతో ఘట్టమనేని అభిమానుల్లో జోష్ నెలకొంది. గత కొంత కాలంగా వారణాసి సినిమా షూటింగ్ కారణంగా మహేశ్ బాబు ఎలాంటి సినిమా ఈవెంట్స్ కు రావడం లేదు. ఇప్పుడు తన అన్న కొడుకు కావడం, తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వైజయంతి బ్యానర్ కావడంతో మహేశ్ ఈ ఈవెంట్ కు రాబోతున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు.