Reading Time: < 1 minute
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సక్సెస్.. HYD మెట్రో విస్తరణపై కీలక ముందడుగు.. రంగంలోకి SBICAPS!

హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం,ఫేజ్ 2 విస్తర‌ణ‌పై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జ‌రిపిన చ‌ర్చలు ఫ‌ల‌ప్రద‌మ‌య్యాయి. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం,ఫేజ్‌-II విస్తర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డ వ‌రుస‌గా రెండు రోజులు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి, కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్టణ వ్యవ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌తో చర్చలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌,ఫేజ్‌-I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌,రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్తర‌ణ‌, ఫేజ్ 2 నిర్మాణ‌ వ్యయం అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్సల్టెంట్ ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. క‌న్సల్టెంట్‌గా SBICAPSని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్తర‌ణ‌ ఇత‌ర అంశాల‌పై SBICAPS స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయ‌నుంది.

ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టనున్నారు. క‌న్సల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి (MA &UD) శాఖ ప్రత్యేక కార్యద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.