Reading Time: < 1 minute
Telangana: ఒకే ఇంట్లో 4 మృతదేహాలు.. నల్గొండలో గుండెల్ని పిండేసే ఘటన.. ఏం జరిగిందంటే..?

నల్గొండలో విషాదం ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ కాలనీలోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి, పురుగులు పట్టిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మృతుల్లో ఇద్దరిని భార్యాభర్తలుగా పోలీసులు గుర్తించారు. సుల్తాన్ నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య హసీనా స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌‌గా పనిచేస్తున్నారు. మిగితా ఇద్దరు వారి పిల్లలా లేక బంధువులా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మూడు రోజుల క్రితమే ఘోరం?

గత కొన్ని రోజులుగా ఇల్లు తెరవకపోవడం, ఇవాళ ఇంటి నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ దారుణ దృశ్యం వెలుగుచూసింది. మృతదేహాలు పూర్తిగా పాడైపోయి, పురుగులు పట్టి ఉండటంతో.. వీరు సుమారు మూడు నుండి నాలుగు రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

గుర్తింపుకు సవాల్‌గా మారిన మృతదేహాలు..

మృతదేహాలు డీకంపోజ్ అవ్వడం వల్ల మరణించిన మిగతా ఇద్దరిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. అసలు ఈ సామూహిక ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా? అనే కోణంలో క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు.

వీడియో చూడండి..