
వర్షాకాలం వచ్చిందంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. పొలాలు దున్ని… విత్తనాలు చల్లి పచ్చని పంటల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ ఏడాది వరుణదేవుడు కన్నెర్ర చేశాడు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. దేశవ్యాప్తంగా వర్షాల లేమితో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షపాతం ఏకంగా 42 శాతం పడిపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్షాభావ సంక్షోభం రైతులను తీవ్రంగా బాధిస్తోంది. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల వైపు మల్లాల్సిన పరిస్థితులు దాపురించాయి.
నైరుతి రుతుపవనాలు ఈ జూన్ నెల ప్రారంభంలో కాస్త ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత క్రమంగా బాగా బలహీనపడ్డాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం ఏకంగా 42 శాతం మేర పడిపోయింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో వర్షాధారిత ప్రాంతాల రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వరి, పత్తి, నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు భారీగా ఆలస్యం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 82 శాతం వర్షపాతం లోటు నమోదు కాగా.. జార్ఖండ్ లో 69 శాతం.. ఛత్తీస్గఢ్లో 67 శాతం లోటు ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ సగానికి పైగా వర్షాలు తగ్గాయి. త్వరలో వర్షాలు ఊపందుకోకపోతే ఈ ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు వానలు రాకపోవడంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. తక్కువ సమయంలో చేతికొచ్చే సోయాబీన్, మొక్కజొన్న లాంటి పంటలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలో కంది పంట వేసేందుకు అన్నదాతలు వానల కోసం ఆకాశం వంక చూస్తున్నారు. మరో రెండు వారాలు చూసి అప్పటికీ వానలు పడకపోతే సోయాబీన్ సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. సాధారణంగా జూన్ మూడో వారం నాటికి మహారాష్ట్రలో రుతుపవనాలు చురుగ్గా మారతాయి. కానీ ఈసారి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
ఎల్ నినో ప్రభావంతో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు నెలకొంటే.. కొన్ని రాష్ట్రాల్లో ఆశ్చర్యకరంగా అంచనాలకు మించి వానలు పడుతున్నాయి. రాజస్థాన్ లో 41 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 3 శాతం సాధారణం కంటే అదనంగా వర్షాలు కురిశాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాలువలు, భూగర్భ జలాల ఆధారంగా వరినాట్లు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మారతాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కూడా అప్రమత్తమైంది. తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న 197 జిల్లాలను గుర్తించి.. అక్కడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.