
Obsession : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, మంచి కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు కూడా చేయగలవని మరోసారి నిరూపిస్తున్న చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించడమే కాకుండా, భారతదేశంలోనూ అనూహ్య స్పందనను అందుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ‘అబ్సెషన్’ కథ కొత్తదేనా? లేక ఇప్పటికే వచ్చిన ఓ హిట్ సినిమాకు పోలిక ఉందా? అనే ప్రశ్నలను ఆయన వ్యాఖ్యలు తెరపైకి తెచ్చాయి.
‘1920’, ‘రాజ్’, ‘హాంటెడ్ 3D’ వంటి హారర్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ భట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘అబ్సెషన్’ గురించి స్పందించారు. తాను ఇప్పటివరకు ఆ సినిమాను చూడలేదని, అయితే కథ విన్నానని, ఆ కథ విన్న వెంటనే తాము రూపొందించిన ‘రాజ్’ సినిమా కథనే అనిపించిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ‘అబ్సెషన్’లోని ప్రధాన మహిళా పాత్ర, ‘రాజ్’ చిత్రంలో మాలిని శర్మ పోషించిన పాత్రను గుర్తు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే అదే సమయంలో ‘అబ్సెషన్’ విజయాన్ని విక్రమ్ భట్ ప్రశంసించారు. ప్రేక్షకులను నిజంగా భయపెట్టే హారర్ సినిమా తీస్తే, అందులో పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆయన చెప్పారు. హారర్ జానర్లో కథ, భయాన్ని సృష్టించే అంశాలే అసలైన హీరోలని, స్టార్ ఇమేజ్ కంటే కథనం బలంగా ఉండటమే విజయానికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్టార్ హీరోల మార్కెట్ గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో ఇలాంటి హారర్ సినిమా తీసినా అది ఆశించిన స్థాయిలో ఆడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, 2025లో అమెరికాలో విడుదలైన ‘అబ్సెషన్’ 2026లో భారతదేశంలోకి వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ సాధించిన ఈ చిత్రం రూ.10 కోట్ల లోపు బడ్జెట్తో రూపొందినప్పటికీ, భారతదేశంలోనే సుమారు రూ.75.69 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమా అయినప్పటికీ బలమైన కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఎంత పెద్ద విజయాన్ని అందుకోవచ్చో ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
మరోవైపు విక్రమ్ భట్ తాజాగా తెరకెక్కించిన ‘హాంటెడ్ 3D: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్’ కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన పది రోజుల్లోనే ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.17.45 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.20.48 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయంపై స్పందించిన విక్రమ్ భట్, గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్లోనూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, ఆ బాధల తర్వాత ఈ సినిమా రూపంలో భగవంతుడు తనకు పెద్ద విజయాన్ని ఇచ్చాడని భావోద్వేగంగా చెప్పడం విశేషం.