Reading Time: 2 minutes
Off The Record Over Delhi Telangana Politics

దేశ రాజధానిలో తెలంగాణకు కేరాఫ్‌ లేకుండా పోతోందా? ప్రస్తుతం ఏపీ మంచితనం మీద ఆధారపడాల్సి వస్తోందా? వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటారోనని తెలంగాణ అధికారులు కంగారు పడుతున్నారా? ఏ విషయంలో అంత టెన్షన్‌ పడుతున్నారు? రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్ళ తర్వాత కూడా ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకకు నిర్మాణానికి అడ్డుపడుతున్నదేంటి? ఢిల్లీలో తెలుగోళ్ళకు కేరాఫ్‌ ఆంధ్ర భవన్. సెంట్రల్ ఢిల్లీలో… అదీ, ఇండియా గేట్‌కు అత్యంత దగ్గరగా ఉన్న ఈ బిల్డింగ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగింది. అయితే… విభజన తర్వాత ఆస్తుల పంపకాల్లో భాగంగా ఆంధ్ర భవన్ ను తాత్కాలికంగా విడగొట్టుకుని ఒకే బిల్డింగ్‌లో రెండు రాష్ట్రాలు అడ్మినిస్ట్రేషన్‌ను కొనసాగిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఢిల్లీలోని ఈ భవన్‌ను చూస్తే గమ్మత్తుగా కనిపిస్తోందని అంటుంటారు చాలామంది. దీనికి ఒకవైపు ఆంధ్ర , మరో వైపు తెలంగాణ అని పక్క పక్కనే బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. పైగా రెండు రాష్ట్రాల ఢిల్లీ భవన్స్‌ ఒకే బిల్డింగ్‌లో ఉండడంతో… వాళ్ళని వీళ్లు, వీళ్లని వాళ్ళు… మెయింటెనెన్స్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. దాంతో ఘనంగా చెప్పుకోవాల్సిన ఆంధ్ర, తెలంగాణ భవన్లు ప్రస్తుతం గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సెక్రటేరియెట్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో, ఢిల్లీలో ఉండే రాష్ట్రాల భవన్లకు అంత ఇంపార్టెన్స్‌ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా… ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్లు, ప్రోటో కాల్ అధికారులు ఉంటారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీ ట్రిప్‌కు వచ్చినప్పుడు భవన్లోనే బస చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో…. తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్ అధికారంలోకి వచ్చాక, భవన్ విభజనపై క్లారిటీ వచ్చింది, పంపకాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మొత్తం ఆంధ్ర వాటా కింద వెళ్ళింది. ఆ ఒప్పందం ప్రకారం పటౌడీ హౌజ్‌లో ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ భవన్ నిర్మాణం జరగాలి.

కానీ… నిర్మాణం ఆలస్యం అవుతూ వస్తోంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్ర భవన్‌లోనే తెలంగాణ భవన్ కొనసాగుతోంది. ఇది ఇలాగే ఉంటే… ఏదో ఒకరోజున ఆంధ్ర వాళ్ళు ఖాళీ చేసి పొమ్మంటే మా పరిస్థితి ఏంటంటూ… తెలంగాణ అధికారులు టెన్షన్‌ పడుతున్నారట. ఢిల్లీ భవన్ విభజన తర్వాత ఏపీకి 11.5 ఎకరాలు, తెలంగాణకు 8.2 ఎకరాలను కేటాయించారు, విభజన ప్రక్రియ మొత్తం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో తెలుగు రాఫ్ట్రాలకు ఉన్న స్థలం 19.7 ఎకరాలు. దాని విలువ 9వేల 913.505 కోట్లు ఉంటుంది. ఇది కూడా కేంద్ర హోంశాఖ చెప్పిన లెక్కే. వాస్తవానికి ఢిల్లీలో బహుళ అంతస్తుల నిర్మాణం కట్టాలంటే ప్రాసెస్ చాలా పెద్దది. మొదట ప్లాన్ రెడీ చేసి అనుమతులను కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్న తెలంగాణ సర్కార్ నిధులు కేటాయించి.. నిర్మాణం కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ… ఆ విషయంలో ఆలస్యం అవుతోంది. దాంతో… దేశ రాజధానిలో రాష్ట్రానికి కేరాఫ్‌గా నిలవాల్సిన భవనం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. రాష్ట్రం నుంచి వచ్చే రాజకీయ నాయకులకు, అధికారులకు , సామాన్యులకు , టూరిస్టులకు కూడా ఇబ్బంది కలుగుతోంది.. మరోపక్క ఏపీ ప్రభుత్వం మాత్రం తన వాటాలోని 11.5 ఎకరాల్లో రూ.124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. అందుకోసం ఏపీ కేబినెట్‌ పచ్చజెండా ఊపింది కూడా. వాళ్ళు వెళ్ళిపొమ్మని ఖాళీ చేయించే పరిస్థితి రాకముందే తెలంగాణ భవన్‌కు పునాదులు వెయ్యాలని కోరుకుంటున్నారు ఇక్కడి అధికారులు.